Niloufer Hospital | హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన చిన్నారి నిజామాబాద్లో క్షేమంగా ఉన్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతో పెంచుకునేందుకు చిన్నారిని అపహరించినట్లు దంపతులు విచారణలో తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. గండిపేట క్రాస్లోని ఓ ఫామ్హౌజ్లో వాచ్మెన్గా పనిచేస్తున్న సల్మాన్ ఖాన్ – ఫరీదా బేగం దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి అస్వస్థతగా ఉండటంతో సెప్టెంబర్ 14వ తేదీన మధ్యాహ్నం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స కొనసాగుతుండటంతో బాబును ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. రాత్రి సమయంలో పెద్ద కుమారుడికి చికిత్స కొనసాగుతుండటంతో చిన్న కొడుకు ఫైజల్ ఖాన్ను పట్టుకుని తల్లి ఫరీదా బేగం మొదటి అంతస్తులో కూర్చొంది. అదే సమయంలో ఫరీదా బేగం దగ్గరకు వచ్చిన ఓ మహిళ.. ఆమెతో సన్నిహితంగా మెలిగింది. పలు అంశాలపై మాట్లాడుతూ దగ్గరైంది. ఇంతలో భోజనం తెచ్చుకునేందుకు ఫరీదా బేగం వార్డు నుంచి బయటకు వెళ్లింది. తిరిగొచ్చి చూసేసరికి చిన్న బాబు కనిపించలేదు.
ఆందోళన చెందిన ఫరీదా బేగం బాబు కనిపించాడా అని చుట్టుపక్కల వాళ్లను అడగ్గా.. అప్పటివరకు ఆమెతో మాట్లాడిన మహిళే బాబును తీసుకెళ్లిందని తెలిపారు. అప్పటిదాకా ఫరీదాబేగంతో సన్నిహితంగా మెలగడంతో వాళ్ల బంధువులే అయ్యి ఉంటారని పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. వాళ్ల సమాధానంతో కంగుతిన్న ఫరీదాబేగం లబోదిబోమంటూ నాంపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాలుడు మిస్సయిన ట్రీట్మెంట్ వార్డులో సీసీ కెమెరా లేకపోవడంతో పోలీసుల దర్యాప్తునకు కొంచెం ఆటంకంగా మారింది. అయినప్పటికీ పట్టువదలకుండా కేసు దర్యాప్తు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. కిడ్నాప్ చేసిన మహిళ నిజామాబాద్లో ఉంటుందని గుర్తించారు.