హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలు ఏర్పడనున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతోపాటు గవర్నర్ కోటా రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో భర్తీ కానున్నాయి.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి హుజూరాబాద్ నుంచి, కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నుంచి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2027 మార్చి వరకు పదవీకాలం ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరి స్థానంలో నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.