Bandi Sanjay | విద్యానగర్ (కరీంనగర్) : ఆరు గ్యారెంటీల పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేవలం పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులకే పరిమితం కావద్దని సూచించారు. కరీంనగర్లో సోమవారం నిర్వహించిన మాజీ ప్రధాని వాజ్పేయ్ జయంత్యుత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
6.75 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ అప్పులు ఎలా తీరుస్తారు, ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో వెల్లడించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. దేశాన్ని అర్ధ శతాబ్ధం వకు పాలించిన కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారుల కోసం రూపాయి విడుదల చేస్తే కేవలం 15 పైసలు మాత్రమే అందేవని, మిగతావి దళారుల చేతికి వెళ్లేవని రాజీవ్ గాంధీ స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.