Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని విజయవాడ శృంగేరి అనుబంధ పీఠం శివగంగ పీఠాధిపతి పురుషోత్తమ భారతీస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వయంభూ నారసింహస్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి.. ప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలను అందించారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారిగా వచ్చిన నేపథ్యంలో పురుషోత్తమ భారతీ స్వామి ఆలయ నిర్మాణాలను తిలకించారు. ఆలయం గొప్పగా, మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ తీరుతెన్నులను పరిశీలించారు.