నిజామాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం సహా అనేక కార్యక్రమాలపై గురువారం మీడియా సమావేశంలో కడుపుమంటను బయటపెట్టుకున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. శుక్రవారం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు విఫలయత్నం చేశారు. రెండురోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్న నిర్మలాసీతారామన్.. శుక్రవారం బాన్సువాడ నియోజవర్గానికి వచ్చారు. బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోనెంబరు రేషన్ దుకాణాన్ని ఆమె తనిఖీ చేశారు. రేషన్ షాపును తనిఖీ చేస్తారని మూడురోజుల ముందే కేంద్రమంత్రి పర్యటన షెడ్యూల్లో అధికారులు పేర్కొన్నారు.
పూర్తిగా అధికారిక కార్యక్రమం కావడంతో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తోపాటు సివిల్ సప్లయ్ అధికారులు బీర్కూర్కు వచ్చారు. కేంద్రమంత్రి మాత్రం ఇందుకు విరుద్ధంగా బీజేపీ శ్రేణులను వెంటబెట్టుకుని రేషన్ షాపునకు చేరుకున్నారు. కాషాయ కండువాలతో రేషన్ షాపులోకి చొచ్చుకొచ్చిన వారంతా తనిఖీని రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. కేంద్రమంత్రి సైతం అడుగడుగునా రాజకీయ వ్యాఖ్యలే చేశారు. బియ్యం పంపిణీ, కార్డుదారుల సంఖ్య, ఇతరత్రా వివరాలను నిర్మల అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత సాధారణంగానే మాట్లాడిన కేంద్రమంత్రి.. వెనక ఉన్న బీజేపీ నాయకులను చూసి రెచ్చిపోయారో లేక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయాలని భావించారో గానీ రాజకీయాలు మాట్లాడటం ప్రారంభించారు. ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తూనే.. అంతా మోదీ చేశారనే తరహాలో ప్రచారానికి దిగారు. అహంభావ పూరితంగా కేంద్రమంత్రి వ్యవహరించిన తీరు చూసి అక్కడే ఉన్న లబ్ధిదారులు, మహిళలు విస్తుపోయారు.
జనం సమాధానంతో కంగుతిన్న నిర్మల
రేషన్ దుకాణం తనిఖీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మహిళలు దీటుగా జవాబిచ్చారు. ప్రభుత్వ వైఫల్యమంటూ ఏదైనా ఉంటే ప్రజల నోటిద్వారా చెప్పించాలని భావించిన కేంద్రమంత్రికి వారు ఊహించని సమాధానం ఇచ్చారు. రేషన్ పంపిణీ సక్రమంగానే సాగుతున్నదని, తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని వారు చెప్పారు. ‘మాకు అంతా మంచిగానే ఇస్తున్నరు.. బియ్యం ఎట్లా వస్తే అట్లా పంపిణీ చేస్తున్నరు’ అంటూ ముఖం మీద చెప్పేశారు. దీంతో కంగుతిన్న కేంద్ర మంత్రి.. ‘కలెక్టర్, అధికారులు ఉన్నారని మీరు భయంతో అలా చెబుతున్నారు. వాస్తవాలు చెప్పండి’ అంటూ బతిమాలడం గమనార్హం. అయినప్పటికీ లబ్ధిదారులు జంకకుండా నిజాలను నిక్కచ్చిగా చెప్పారు. దీంతో ఏమీ పాలుపోని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వంపై నిర్మల నేరుగా బురద జల్లేందుకు యత్నించారు. ఒకింత అసహనానికి గురైన ఆమె.. ఓ వైపు మీడియా ప్రతినిధులను, మరోవైపు సివిల్ సప్లయ్ అధికారులను, కనిపించిన వారందరిపైనా రుసరుసలాడారు.
రేషన్ డీలర్పై చిందులు
రేషన్ డీలర్పై కేంద్రమంత్రి నిర్మల తన ప్రతాపాన్ని చూపారు. వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించిన రేషన్ డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ డీలర్షిప్ను రద్దు చేయిస్తా. అధిక ప్రసంగం చేయొద్దు’ అంటూ బెదిరించారు. లబ్ధిదారులతో ఆమె నేరుగా మాట్లాడుతున్న సమయంలో కేంద్రమంత్రి పదజాలం స్థానిక మహిళలకు అర్థం కాలేదు. సగం ఇంగ్లిష్, సగం తమిళ వాసనతోకూడిన తెలుగు కలగలిపి మాట్లాడటంతో వారు అయోమయానికి గురయ్యారు. అక్కడే ఉన్న డీలర్ జోక్యం చేసుకుని, మంత్రి అడిగిన ప్రశ్నను మహిళలకు వివరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహోదగ్రురాలైన కేంద్రమంత్రి.. ‘ఏయ్ నువ్వు డీలర్వా?.. మహిళలను బెదిరిస్తున్నావా? పక్కకు జరుగు’ అంటూ మండిపడ్డారు. దూరం పోవాలంటూ డీలర్ను రెండు చేతులతో పక్కకు నెట్టేందుకు ప్రయత్నించారు. పదే పదే మీడియాకు చూపుతూ.. బిగ్గరగా అరిచారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాల్సిందిపోయి.. ఇలా భిన్నంగా ప్రవర్తిండం ఏమిటంటూ అక్కడున్న వారంతా విస్తుపోయారు.
కలెక్టర్ను అవమానించేలా…
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కేంద్రమంత్రి అమర్యాదకరంగా వ్యహరించారు.
‘నువ్వు ఐఏఎస్వేనా’ అంటూ ప్రశ్నించారు. ‘కేంద్రం ఎంత బియ్యం ఇస్తున్నదో కూడా తెలీదా..?’ అంటూ తాను అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం చెప్పే వరకు కూడా ఆమె వేచి చూడకుండా అనుచితంగా వ్యాఖ్యానించారు. రేషన్ దుకాణంలో ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని కలెక్టర్ను అడిగారు. మార్గదర్శకాల మేరకే తాము వ్యవహరిస్తున్నామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సమాధానం ఇచ్చారు.
మోదీ ఫొటో పెట్టాలంటూ హుకుం
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.. టీఆర్ఎస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ చెప్పలేదు. కానీ రేషన్ షాపుల్లో మోదీ ఫొటో పెట్టాలంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి కలెక్టర్కు హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. ‘నేను మళ్లీ వచ్చేసరికి మోదీ ఫొటో పెట్టాలి. లేకపోతే నేనే ఫొటో పెట్టి వెళ్తా. ఆపై మీ ఇష్టం’ అంటూ ఆమె బెదిరింపులకు దిగారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమానికి వెళ్లిపోయారు.
నిర్మల ఒకవైపు.. నిజం మరోవైపు
కేంద్రమంత్రి : రేషన్ షాపుల ద్వారా తలా 30 కేజీలు ఇస్తున్నాం.
వాస్తవం: కేంద్ర ఆర్థికమంత్రికి ఒక్కొక్కరికి ఎన్ని కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారో, వాటిని ఏ విధంగా ఇస్తున్నారో అనేదానిపై కనీస అవగాహన లేదు. ప్రతినెలా ఒక్కొక్కరికి పంపిణీ చేస్తున్న బియ్యం 10 కేజీలు. ఏప్రిల్ నెలలో సాంకేతిక కారణాలతో రాష్ట్రంలో పంపిణీ జరుగలేదు. ఈ కోటా (5 కేజీలు) కలిపి ఆగస్టులో 15 కేజీలను రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేసింది. అంటే ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం వస్తాయి. కానీ ఇవేవీ తెలియని కేంద్రమంత్రి.. కలెక్టర్పై రుసరుసలాడారు. అయితే కేంద్రమంత్రి అజ్ఞానానికి నవ్వుకున్న లబ్ధిదారులు ‘మేడం.. మాకు 30 కాదు.. మనిషికి 15 కేజీలే వస్తాయి’ అంటూ సమాధానమిచ్చారు.
కేంద్రమంత్రి: నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక రెండు మూడు విషయాలు లబ్ధిదారులు, కలెక్టర్ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఎంతమంది లబ్ధిదారులున్నారు?
కలెక్టర్ : బీర్కూర్ షాప్ నెంబర్-4 పరిధిలో 685 మంది ఉన్నారు.
కేంద్రమంత్రి: ఇప్పుడు మీరు చెప్పండి. గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కింద అందించేవి ఫ్రీగా ఇస్తున్నారా? అందరికీ అందిందా? గ్యాప్స్ ఏమి వచ్చాయి. జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా? రేపు మా వాళ్లు(బీజేపీ) అడుగుతారు? ఎందుకంటే వాళ్లు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. అందరిముందు వివరాలు చెప్పండి.
కలెక్టర్ : మనం ఉన్న రేషన్ షాపులో 645 రెగ్యులర్ కార్డులున్నాయి. 40 అంత్యోదయ కార్డులున్నాయి. తమరు చెప్పినట్లుగా ఐదు కేజీల బియ్యం ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాం. ఏప్రిల్-2020 నుంచి నవంబర్-2021 వరకు పంపిణీ చేశాం.
కేంద్రమంత్రి: అమ్మా మీకు మొత్తం ముఫ్త్ (ఉచితం).ఇక్కడ రెండు రూపాయలు, ఒక రూపాయి కాకుండా మోదీ ఉచితంగా పంపిస్తున్నారు. అది తీసుకుంటున్నారా?
లబ్ధిదారులు : తీసుకుంటున్నాం.
కేంద్రమంత్రి: ఏమ్మా.. నిజం చెప్పండి తీసుకున్నారా?
లబ్ధిదారులు : తీసుకున్నామమ్మా…
కేంద్రమంత్రి: భయపడకండి. ధైర్యంగా చెప్పండి. మోదీ ఇచ్చిన పూర్తి ఉచిత బియ్యం వచ్చాయా? పోయిన నెల ఎంత తీసుకున్నారు?
లబ్ధిదారులు : తీసుకున్నామమ్మా. మా ఇంట్ల ముగ్గురం ఉంటాం. 15 కిలోలు వచ్చాయి.
కేంద్రమంత్రి: ఓకే. మోదీ ఇచ్చినవి 15 కిలోలు. సాధారణంగా వచ్చేవి ఎంత?
లబ్ధిదారులు : (అమోమయంగా) అంతే. 15 కిలోలు వచ్చాయి
కేంద్రమంత్రి: చూశారా కలెక్టర్…(తప్పు జరిగిందన్నట్లుగా..) ఇదేంటి? నేను వీరిని తీసుకురాలేదు. దగ్గర 30 కేజీలు రావాలి. ఈ 30లో 15 కేజీలు ఉచితంగా అందించడం మీ బాధ్యత. (ప్రజలవైపు తిరిగి.. ) మీకు అందిందో లేదో చెప్పేందుకు మీరంతా జడుసుకుంటున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారున్నారు. డీలర్ గారేమో కండ్లు పెద్దవి చేసి చూస్తున్నారు. వాళ్లు బెదిరిస్తున్నారు. వస్తది. నిజం వస్తది.
కలెక్టర్నుద్దేశించి కేంద్రమంత్రి : మీరు, మీ యంత్రాంగం అవగాహనతో ఉంది. ప్రజలకు ఏ రూపంలో బియ్యం వస్తున్నాయో తెలపకపోవడం కరెక్ట్ కాదు. వాళ్ల హక్కు ఏమిటి అన్నది స్పష్టంగా తెలియకపోవడం వల్ల బీచ్మే కుచ్భీ హో సక్తా హై (మధ్యలో ఏమైనా జరుగొచ్చు). హక్కు ప్రకారం అందాల్సిన బియ్యం, పప్పు వివరాలు వారికి తెలియకపోతే ఎలా.? నేను వీళ్లను తీసుకు రాలేదు. మీరు తెచ్చినవాళ్లే. (పక్కకు జరుగుతన్న లబ్ధిదారులనుద్దేశించి) ఫర్వాలేదమ్మా మీకు బియ్యం ఇస్తారు. కొద్దిసేపు వెయిట్ చేయండి.
డీలర్ : వాళ్లకు అర్థంగాక చెబుతున్నారు మేడం. మేము బియ్యం మొత్తం ఇచ్చాం.
కేంద్రమంత్రి: ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోకు. నీ జవాబు నాకు అక్కర్లేదు. (అధికారులవైపు తిరిగి..)
కేంద్రమంత్రి: మోదీ ఫొటో పెట్టమని అడిగితే మా వాళ్లపై గంతులు వేస్తున్నారు. ప్రజల కోసం చేసే కార్యక్రమమిది. ఇవ్వాళ ఇక్కడ చెబుతున్నా. మా వాళ్లు తెచ్చి ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెడతారు. మీరు జిల్లా అధికారిగా ఆ ఫ్లెక్సీని తీయనీయకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఆ గొప్ప నాయకుడి ఫొటో పెట్టడానికి మీకెందుకు అభ్యంతరం? నేనే మళ్లీ వస్తాను. ఇక్కడ ఫ్లెక్సీ కనబడకపోతే నేనే పెడతాను.