హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో సేకరించిన అంశాలను నిర్ధారించుకోవడానికి సిట్లో క్రాస్ వెరిఫికేషన్ పేరుతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. నిందితులు చెప్పిన విషయాలు, సిట్ సేకరించిన సమాచారం, ఫోన్ కాల్డాటా, వాట్సాప్, ఈ మెయిల్స్, లొకేషన్లకు సంబంధించి సేకరించిన అన్ని అంశాలను శాస్త్రీయ పద్ధతిలో ఈ బృందం క్రాస్ చెక్ చేయనున్నది.
ఈ కేసులో ఫోరెన్సిక్ ఫైనల్ నివేదికలు రావాల్సి ఉండగా, ఇటీవల డీఈవో పేపర్ లీకేజీకి సంబంధించి అరెస్టయిన ఖమ్మం జంట సాయిలౌకిక్, సుష్మితను కస్టడీలోకి తీసుకోవాల్సి ఉన్నది. ఈ రెండు మినహా కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టేనని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలతో స్టేటస్ రిపోర్టు తయారుచేసి మంగళవారం న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని సిట్ అరెస్టు చేసింది.