TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లీకేజీల వ్యవహారంలో టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి గ్రూప్-1 పేపర్లపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్ అధికారులు గురువారం విచారణకు హాజరై, వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. దాంతో రేవంత్రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణలో ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
నిరాధారణ ఆరోపణలు చేశారనే కోణంలో చర్యలకు సిద్ధమయ్యారు. న్యాయసలహా తీసుకొని రేవంత్పై చర్యలు తీసుకుంటామని సిట్ వర్గాలు తెలిపాయి. ఇటీవల రేవంత్రెడ్డి లీకేజీపై గ్రూప్-1 పరీక్ష రాసిన ఒకే మండలానికి చెందన 100 మందికి వందకుపైగా మార్కులు వచ్చాయని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు పిలువగా.. సిట్కు సాక్ష్యాలను అందించడంలో విఫలమయ్యారు. దాంతో చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తున్నది. ఇదే విషయంలో శుక్రవారం విచారణకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మరో వైపు సిట్ అధికారులు లీకేజీ వ్యవహారంపై విచారణ ముమ్మరం చేశారు. గ్రూప్-1 పరీక్ష రాసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై ఆరా తీశారు. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను అధికారులు తెలుసుకున్నారు. ఉద్యోగుల్లో మరో ఇద్దరికి గ్రూప్-1లో భారీగా మార్కులు వచ్చినట్లు గుర్తించారు. షమీమ్కు 127, రమేశ్కు 122 మార్కులు వచ్చాయి. రమేశ్ అనే వ్యక్తి కాంటాక్టుపై పని చేస్తున్నాడు. బుధవారం ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.