హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేత బొమ్మరబెట్టు లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్ ), భారత్ ధర్మ జనసేన(బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, కేరళకు చెందిన వైద్యుడు కొట్టిలిల్ నారాయణన్ జగ్గు (జగ్గు స్వామి), కరీంనగర్ న్యాయవాది భూసారపు శ్రీనివాస్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నలుగురినీ నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడాన్ని సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు బుధవారం లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై న్యాయమూర్తి జస్టిస్ డీ నాగార్జున విచారణ జరిపారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయకుండా, ఏకపక్షంగా విచారణ జరుపబోమని ప్రకటించారు. ఈ క్రమంలోనే నలుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి..తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్, తుషార్ వెల్లపల్లి, జగ్గుస్వామి, న్యాయవాది భూసారపు శ్రీనివాస్లను నిందితులుగా ప్రతిపాదిస్తూ తాము మెమో దాఖలు చేస్తే ఏసీబీ కోర్టు కొట్టివేసిందని, ఏసీబీ కోర్టుకు ఆ అధికారాల్లేవని పేర్కొంటూ సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉందని.. సిట్ దర్యాప్తును అడ్డుకునేందుకు ఏ కోర్టుల్లోనూ ఉత్తర్వులు వెలువడలేదని ఏజీ తెలిపారు. ఈ దశలో నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను కొట్టేసే అధికారం ఏసీబీ కోర్టుకు లేదని వాదించారు. ఏసీబీ కోర్టు తన పరిధిని దాటి వెలువరించిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఏజీ కోరారు. సిట్ దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసేవరకు ఏసీబీ కోర్టు జోక్యానికి తావుండదని తెలిపారు. సిట్ దర్యాప్తును హైకోర్టు, సుప్రీంకోర్టులే అడ్డుకోలేదని గుర్తు చేశారు.
అలాంటిది కొట్టివేత ఉత్తర్వులను ఏసీబీ కోర్టు వెలువరించడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. కేసు దర్యాప్తులో లభ్యమయ్యే సాక్ష్యాధారాలకు అనుగుణంగా కొత్తగా నిందితులను చేర్చే హకు సిట్కు ఉంటుందని అన్నారు. ఈ హకును కాలరాసేలా ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా ఎవరు నిందితులో, ఎవరు అనుమానితులో, ఎవరు సాక్షులో నిర్ణయించే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుందన్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు మెమోను రద్దు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందరావు వాదిస్తూ.. సిట్ దాఖలు చేసిన అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ కాపీ తమకు అందలేదని, అలాంటప్పుడు తామెలా వాదనలు వినిపించాలని ప్రశ్నించారు. వాదనల తర్వాత హైకోర్టు.. ప్రతివాదులైన నలుగురికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసిన న్యాయస్థానం ఆ రోజున తొలికేసుగా విచారణ చేస్తామని తెలిపింది.