హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నదని, ఈ వ్యవహారంపై ప్రజాహిత వ్యాజ్యాన్ని అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ను సింగిల్ జడ్జి విచారిస్తున్నారని, సిట్ దర్యాప్తుపై ఇప్పటికే 3 స్థాయీ నివేదికలను కూడా సమర్పించామని వివరించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేత బక జడ్సన్ వేసిన పిల్కు నంబర్ను కేటాయించేందుకు రిజిస్ట్రీ నిరాకరించడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదనలు కొనసాగిస్తూ.. సిట్ దర్యాప్తునకు ఆటంకాలు కల్పించేందుకే ఈ పిల్ వేశారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం వేసిన ఈ పిల్ను కొట్టేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. దర్యాప్తు పారదర్శకంగా ఉండేందుకు ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పిల్కు నంబర్ కేటాయించాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. పిల్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్తోపాటు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, టీఎస్పీఎస్సీ చైర్మన్కు, హైదరాబాద్ సీపీ, సీబీఐ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.