హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసినట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. సిట్కు చీఫ్గా ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఐజీ తరుణ్జోషీని నియమించారు. అయితే, ఈ సిట్ను గత నెలలోనే ఏర్పాటు చేసినా విషయం బయటికి రాలేదు. సిట్లో సభ్యురాలిగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ ఎస్పీ సీ నర్మదను తొలగించి, సీఐడీ హెడ్క్వార్టర్స్ ఎస్పీగా ఉన్న ఎన్ అశోక్కుమార్ను చేర్చుతూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, హెచ్సీఏపై నమోదైన నాలుగు కేసులను ఈ సిట్కు బదిలీ చేశారు.
గతంలో నమోదైన కేసులతోపాటు తాజా కేసులపై సిట్ దర్యాప్తు చేయనున్నది. 2011లో వివిధ క్రికెట్ క్లబ్ల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు తొలి కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ స్టేడియం నిర్మాణ వ్యయాన్ని రూ.30 కోట్ల నుంచి రూ.108 కోట్లకు పెంచడం, కుర్చీల కొనుగోలులో అవినీతిపై ఈ కేసులు నమోదుచేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో పలువురు మాజీ క్రికెటర్లు ఉన్నారు. 2014లో ఉప్పల్ స్టేడియంలో రెండు స్టాండ్స్కు పైకప్పు నిర్మాణ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టి, రూ.3 కోట్లకు పైగా నష్టం చేకూర్చారనే ఆరోపణలపై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఇందులోనూ పలువురు ప్రముఖులు ఉన్నారు. 2023 అక్టోబర్లో హెచ్సీఏ సీఈవో సునీల్ కాంతే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ స్టేడియం పరికరాల కొనుగోళ్లలో రూ.3.85 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందని కొన్ని కేసులు నమోదయ్యాయి. దీని ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. 2025 జూలైలో క్రికెట్ బంతుల కొనుగోలు, ప్లంబింగ్ పనుల నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలపై తెలంగాణ సీఐడీ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ అన్ని కేసులపై సీఐడీ తరఫున ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
1) డాక్టర్ తరుణ్ జోషి, ఫ్యూచర్ సిటీ సీపీ, సిట్ చీఫ్
2) ఎన్ అశోక్కుమార్, సీఐడీ ఎస్పీ
3) ఎన్ఎస్ మోహన్ రాజా, సీఐడీ అడిషనల్ ఎస్పీ
4) ఎస్ మోహన్కుమార్, ట్రాఫిక్ ఏసీపీ హైదరాబాద్
5) జీ గోపీనాథ్, సీఐడీ ఇన్స్పెక్టర్
6) పీ రాజశేఖర్, సీఐడీ ఇన్స్పెక్టర్