హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై నిజనిర్ధారణకు ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 387 పేజీల తుది నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. నివేదికపై వాదనలు ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సాఫ్ట్ కాపీ రూపంలో కేసులో భాగస్వాములందరికీ పంపాలని ఆదేశించింది. నివేదికపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. నిందితులను ఎన్కౌంటర్ చేసిన సమయంలో అక్కడ ఉన్న పోలీసులు వీ సురేందర్, కే నర్సింహారెడ్డి, షేక్లాల్ మదార్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కే వెంకటేశ్వర్లు, ఎస్ అర్వింద్గౌడ్, డీ జానకీరాం, ఆర్ బాలూ రాథోడ్, డీ శ్రీకాంత్పై విచారణ జరపాలని కమిషన్ తన నివేదికలో సూచించినట్టు సమాచారం.