హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేసే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మధుసూదనాచారి రాష్ట్ర శాసనసభకు తొలి స్పీకర్గా పనిచేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఆయన 2021 నవంబర్లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. 2027 నవంబర్ వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగానే కాకుండా శాసనమండలిలోనూ బీఆర్ఎస్కు సీనియర్ ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మధుసూదనాచారి నియమించే అవకాశాలున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తున్నది.