మధ్య మానేరులో అతిపెద్ద ఆక్వాహబ్!
తెలంగాణ మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం
ఎస్సారార్ జలాశయం కేంద్రంగా ఏర్పాటుకు నిర్ణయం
500 ఎకరాలు కేటాయించే దిశగా టీఎస్ఐఐసీ చర్యలు
రూ.2 వేల కోట్ల పెట్టుబడి.. 10 వేల మందికి ఉపాధి
అమెరికాలోని ఫిష్ఇన్ సహా నాలుగు కంపెనీలు రెడీ
పూర్తయితే ప్రపంచంలో అతిపెద్ద ఆక్వాహబ్ మనదే
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఫిష్ఇన్ సంస్థ ఒప్పందం
ఇకపై తెలంగాణ నుంచి విదేశాలకు చేపల ఎగుమతి
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ఇప్పటికే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యరంగం దశ, దిశను మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేరు) కేంద్రంగా ‘ఆక్వా హబ్’ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 500 ఎకరాలను కేటాయించనున్నది. ఆక్వారంగంలో పేరున్న నాలుగు అతిపెద్ద కంపెనీలు రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ముందుకొచ్చాయి. వీటిలో అమెరికన్ సంస్థ ఫిష్ ఇన్ ఒక్కటే రూ.1000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నది. దీంతోపాటు దేశీయ సంస్థలు ఫ్రెష్ టు హోం, ఆనందా గ్రూప్, సీపీ ఆక్వాకల్చర్ గ్రూప్ ఆక్వాహబ్లో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తపరిచాయి.
ఇందులో కొన్ని కంపెనీలు కేజ్ కల్చర్(పంజరం మాదిరి) విధానంలో చేపల పెంపకాన్ని చేపట్టనుండగా, మరికొన్ని కంపెనీలు సాధారణ పద్ధతిలో చేపలు పెంచనున్నాయి. చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు పర్యావరణహితమైన, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థలు వినియోగించనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. పలు రిజర్వాయర్ల నిర్మాణంతో చేపల పెంపకానికి మంచి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రతి రిజర్వాయర్ను చేపల పెంపకానికి అనువుగా మార్చి.. ఆక్వాహబ్గా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే మొదటి దశలో మిడ్ మానేరును ఎంచుకున్నది. ఇది కేజ్ కల్చర్కు, చేపల పెంపకానికి అత్యంత అనువైన ప్రాంతంగా పరిశోధనలో తేలింది. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.
10వేల మందికి ఉపాధి
రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఆక్వాహబ్లో నాలుగు అతిపెద్ద కంపెనీలు రూ. 2వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. తద్వారా సుమారు ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనుంది. ఫిష్ఇన్, ఫ్రెష్ టూ హోమ్, ఆనందా గ్రూప్, సీపీ గ్రూప్ కంపెనీలు పెట్టుబడికి ముందుకొచ్చాయి. ఇప్పటికే ఫిష్ఇన్ సంస్థకు 120 ఎకరాల స్థలం కేటాయించగా.. మిగిలిన ఒక్కో కంపెనీకి 100-120 ఎకరాల స్థలం కేటాయించనున్నారు. ఫిష్ఇన్ కంపెనీ రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుండగా.. మిగిలినవాటిల్లో ఒక్కో కంపెనీ సుమారు రూ. 250-300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నాయి.
మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ర్టానికి ఫిష్ఇన్
అమెరికా బేస్డ్ సంస్థ అయిన ఫిష్ఇన్ను రాష్ర్టానికి తీసుకురావడంతో మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ఈ సంస్థతో మాట్లాడి… ఇక్కడి పరిస్థితులను వివరించి పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు. ప్రపంచ మత్స్యరంగంలో ఫిష్ఇన్ కంపెనీ కీలకమైంది. ఈ కంపెనీ అత్యధికంగా రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ సంస్థకు 120 ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ ద్వారా ఇప్పటికే కేటాయించింది. ఈ సంస్థ కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకాన్ని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నది. ఈ ఒక్క సంస్థనే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఈ సంస్థ ఎగుమతికి అనుకూలమైన ‘తిలాపియా’ ప్రత్యేక రకం చేపల్ని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే ఏటా 85వేల నుంచి లక్ష టన్నుల చేపల్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాహబ్గా…
మిడ్మానేరు వద్ద ఏర్పాటు చేయనున్న సమీకృత మంచినీటి ఆక్వా హబ్ (ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్వాటర్ ఆక్వా హబ్) ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఒకేచోట 500 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఈ ఆక్వాహబ్లో కేవలం చేపల్ని పెంచడమే కాకుండా చేపల శుద్ధికేంద్రాలను, చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను, శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆక్వాహబ్ కేంద్రంగా ప్రధానంగా ఎగుమతికి అనుకూలమైన చేపలను పెంచనున్నారు. ఈ నేపథ్యంలో కొద్దికాలంలోనే తెలంగాణ చేపలు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి కానున్నాయి.