ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 28: వృత్తినే సర్వస్వంగా భావించి, విద్యా సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచి, హోదానే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఎంఈవో రాజయ్య ఇకలేరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎంఈవో మంకు రాజయ్య కరోనాతో బుధవారం మృతిచెందారు. కోనరావుపేట మండలం ధర్మారంలో ఓ నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన రాజయ్య(50) 1995లో టీచర్ ఉద్యోగం సాధించారు. 2005లో ఎల్లారెడ్డిపేట ఎంఈవోగా నియమితులై, నాటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. ముస్తాబాద్ మండల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 23న పాఠశాలల తనిఖీకి వెళ్లిన ఆయన ముస్తాబాద్ మండలం కొండాపూర్లో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. మూడురోజులు ఇంటివద్దే చికిత్స తీసుకున్న ఆయన సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించి బుధవారం మరణించారు.
స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక
ఎంఈవో రాజయ్య మంత్రి కేటీఆర్కు ఆప్తుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను చైతన్యపరిచారు. ఊరూరా దీక్షా శిబిరాలను ఏర్పాటుచేసి రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పారు. వృత్తిబాధ్యతల్లోనూ అంతే క్రమశిక్షణతో పనిచేసేవారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘మనబడి- మనందరి బాధ్యత’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించి పలు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్రం 2014 నవంబరులో ఉత్తమ విద్యాపరిపాలన అధికారిగా జాతీయ పురస్కారం అందించింది. ఉమ్మడి రాష్ట్రంలో నవంబర్ 11న నాటి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ చేతుల మీదుగా ఉత్తమ మండల విద్యాధికారిగా, 2014 జవనరి 26న కరీంనగర్ జిల్లా ఉత్తమ ఎంఈవోగా అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్య చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2014 నవంబరు 29న అప్పటి కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఉత్తమ విద్యాపరిపాలన అధికారిగా అవార్డును సొంతం చేసుకున్నారు. 2016లో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా జిల్లాస్థాయి ఉద్యోగుల ప్రోత్సాహక అవార్డును అందుకున్నారు.
ప్రాణాలు కాపాడేందుకు కేటీఆర్ కృషి
సిరిసిల్లలోని ఓ దవాఖానలో చేరిన రాజయ్యకు శ్వాస సమస్యలు తలెత్తడంతో అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి తన సిబ్బందిని పంపించి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. అయినప్పటికీ రాజయ్య ప్రాణాలు దక్కకపోవడంతో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రాజయ్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజన్న సిరిసిల్ల డీఈవో రాధాకిషన్, సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఏ రాజేశ్వర్రావు విచారం వ్యక్తంచేశారు.