హైదరాబాద్ : భారత రైతాంగ శ్రేయస్సు కోసం మహాయజ్ఞం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు సర్ ఛోటూ రామ్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు కలిసి అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద రంగం వ్యవసాయం. ఇందులో విశేషమైన మార్పు రావాలన్నది కేసీఆర్ సంకల్పం అని స్పష్టం చేశారు. ఇక్కడి భూమిని, నీళ్లను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రపంచానికి మనమే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగగలదు. కానీ ప్రస్తుత విధానాలు అందుకు తగ్గట్టులేవు అని తెలిపారు.
ఆహార రంగంలో గొప్ప ఉపాధి అవకాశాలు ఉన్నాయని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏవీ కనిపించలేదన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం చేసి కొత్త దారి చూపాలన్న తపనతో సీఎం ఉన్నారని స్పష్టం చేశారు. దీనికి మేధావులు, రైతు నాయకులు విశేషంగా ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి 700 మంది పైచిలుకు రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోయిందన్నారు. రైతుల పోరాటానికి తలొగ్గి, నిస్సిగ్గుగా జాతికి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నా చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ఆలోచన తట్టలేదని ధ్వజమెత్తారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాల ఎల్లలు దాటి చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.
ఇది ఆర్థిక చేయూత మాత్రమే కాదు .. రైతుల కష్టాలలో భాగం పంచుకునే ఒక గొప్ప ముఖ్యమంత్రిని కేసీఆర్లో చూస్తున్నాం అని పంజాబ్ రైతు నాయకులు కొనియాడారు.
హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు పంజాబ్ రైతులు ప్రదానం చేసిన సర్ ఛోటూ రామ్ అవార్డును రైతాంగ ప్రతినిధుల నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మూసీ రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
అవార్డును మంత్రికి అందజేసిన వారిలో ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సంయుక్త్ కిసాన్ మోర్చా సభ్యులు సత్నాం సింగ్ బెహ్రూ, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ అఖిల భారత సలహాదారులు సుఖ్ జిందర్ సింగ్ కాకా, రాచ్ పాల్ సింగ్ ఖల్సా, మీడియా కార్యదర్శి అవతార్ సింగ్ దుండా ఉన్నారు.
పంజాబ్ రైతులు ప్రధానంగా ఇద్దరు వ్యక్తులను ఆరాధిస్తారు. ఒకరు సర్ ఛోటూ రామ్, మరొకరు స్వామినాథన్. 1881లో బ్రిటీష్ ఇండియాలో పంజాబ్ ప్రావిన్స్లో సర్ ఛోటూ రామ్ ఝాట్ కుటుంబంలో జన్మించారు. యునైటెడ్ పంజాబ్ ప్రావిన్స్ను పాలించిన నేషనల్ యూనియనిస్ట్ పార్టీకి ఆయన సహా వ్యవస్థాపకుడు. నాడు కాంగ్రెస్, ముస్లింలీగ్ను తన పార్టీకి దూరంగా ఉంచారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడి నలిగిపోతున్న నాటి పంజాబ్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా సర్ ఛోటూ రామ్ 1934లో పంజాబ్ రిలీఫ్ అప్పుల చట్టం, 1936లో పంజాబ్ రుణదాతల రక్షణచట్టం తేవడానికి కృషిచేశారు. తదనంతర కాలంలో ఈ చట్టాలు పంజాబ్ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాయి. ఆ తర్వాత హరితవిప్లవంతో స్వామినాథన్ పంజాబ్ రైతులను గణనీయంగా ప్రభావితం చేశారు. ఆ తర్వాత తమను ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆర్ అని పంజాబ్ రైతులు మంత్రి నిరంజన్ రెడ్డితో అన్నారు. అందుకే ఈ అవార్డు వారికి ఇస్తున్నట్లు పంజాబ్ రైతులు వెల్లడించారు.