ఖిల్లాఘణపురం, ఆగస్టు 20 : కర్ణె తండా లిఫ్ట్ పంపులను రెండ్రోజుల్లో ప్రారంభించాలి.. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎత్తయిన ప్రాంతాల్లోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తిపోతలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. గురువారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని కర్ణెతండా ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 2022 మార్చి 8న రూ.76.16 కోట్లతో కర్ణె తండా లిఫ్ట్నకు శంకుస్థాపన చేయగా.. పనులు పూర్తి చేశామన్నారు.
కేవలం సబ్స్టేషన్ నిర్మాణం మాత్రమే పెండింగ్లో ఉన్నదని, ఇందుకోసం రూ.2 కోట్లు కూడా మంజూరు చేసి ఉంచినట్టు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సబ్స్టేషన్ పూర్తి చేయడానికి రెండేండ్లు తీసుకున్నదని విమర్శించారు. రైతుల ఒత్తిడితో వెట్న్ నిర్వహించి తర్వాత మోటర్లు బంద్ పెట్టారని, ప్రస్తుతం కృష్ణానదికి వరదలు వస్తున్నాయని, వెంటనే మోటర్లు ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ పథకంతో దాదాపు 6 గ్రామాలు, 9 గిరిజన తండాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. 58 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు 800 హార్స్పవర్ మోటర్లు రెండు ఏర్పాటుచేశామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతలు ప్రారంభించాలని, డిమాండ్ చేశారు.