హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) అకాల మరణం చెందారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా కారుకొండలోని తన ఫామ్హౌస్కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు (Heart attack) రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని రంగారెడ్డిరెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు.
గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వనస్థలిపురంలోని సాహెబ్నగర్ (Sahebnagar) స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యహ్నం గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. కాగా, మరికాసేపట్లో గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి సీఎం కేసీఆర్ (CM KCR) వెళ్లనున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.
సాయిచంద్ భౌతికకాయానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రులు సాయిచంద్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుముందు గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో మంత్రి హరీశ్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే నోముల భగత్.. సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.