హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దేశంలో గత రెండేండ్లుగా నెలకొన్న కరోనా పరిస్థితులను సింగరేణి సంస్థ అధిగమించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికా ర్డు స్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్ను సాధించింది. సింగరేణి సంస్థ మొత్తంగా రూ. 1,722 కోట్ల లాభాలను ఆర్జించింది. పన్నులు పోగా బొగ్గు, విద్యుత్తు అమ్మకాలపై రూ.1,227 కోట్ల నికర లాభం సాధించినట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ బుధవారం ప్రకటించారు. గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.3,596 కోట్లు చెల్లించామని తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా సింగరేణి సంస్థ వరుస లాభాలను నమోదు చేస్తున్నది.
2021-22లో సింగరేణి రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా.. 655 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ద్వారా 8,808 మిలియన్ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేశారు. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని శ్రీధర్ కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో కునారిల్లిన సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత లాభాల బాట పట్టింది. గత ఎనిమిదేండ్లుగా చక్కటి ప్రతిఫలాలను అందిస్తున్నది. 2013-14లో 504 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసిన సింగరేణి సంస్థ.. 2021-22 నాటికి 650 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. 2013-14లో రూ.11,928 కోట్ల టర్నోవర్ ఉండగా.. ప్రస్తుతం రూ.26,607 కోట్లకు వృద్ధి చెందింది. నికర లాభాలు కూడా ఈ ఏడాది రూ.1,227 కోట్లకు చేరుకోవడం విశేషం. వచ్చిన లాభాల్లోంచి సీఎం కేసీఆర్ ఏటేటా లాభాల వాటా శాతాన్ని పెంచుతూ.. సింగరేణి ఉద్యోగులు, కార్మికులపై వాత్సల్యాన్ని, అభిమానాన్ని చాటుతున్నారు. గత రెండేండ్లుగా కరోనా కారణంగా సంస్థ లాభాలపై కొంత ప్రభావం పడింది. 2021-22లో కరోనా ప్రభావాన్ని పూర్తిగా తట్టుకొని లాభాలను ఒడిసిపట్టుకొన్నది.
కొత్తగూడెం సింగరేణి/యైటింక్లయిన్ కాలనీ, సెప్టెంబర్ 28: సింగరేణిలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన నికర లాభంపై 30 శాతం వాటాను సంస్థ ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంస్థ వ్యాప్తంగా బుధవారం సంబురాలు అంబరాన్నంటాయి. ఈ మేరకు కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో టీబీజీకేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. లాభాల్లో వాటాను ప్రకటించి కార్మికులపై తనకున్న అభిమానాన్ని సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారన్నారు. కాగా పెద్దపల్లి జిల్లా యైంటిక్లయిన్ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకలు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.