పెద్దపల్లి: సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రధాని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపు మేరకు టీబీజీకేఎస్ (TGBKS) ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు మహాధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు.
భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో ధర్నాకు దిగారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో టీబీజీకేఎస్ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
కాగా, బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భూపాలపల్లిలో నిర్వహించనున్న ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం యత్నిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సింగరేణి ప్రైవేటికరణ ఆపే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. పేదల పొట్టకొట్టి పెద్దలకు పంచడమే మోదీ విధానమని విమర్శించారు.
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇచ్చిన మాట నిలుపుకోని మోదీకి తెలంగాణలో తిరిగే హక్కు లేదని నినాదాలు చేశారు.
మంచిర్యాలలోని నస్పూర్ చౌరస్తాలో సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ సంఘం నేతలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఇందులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, రాథోడ్ బాపూరావు, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు పాల్గొన్నారు.