హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ నెల 28న ఒక్కరోజే 2.46 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అదేరోజు 2.53 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఇందుకోసం 44 రైలు బండ్ల(రేక్స్)ను ఉపయోగించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందిని సీఎండీ ఎన్ శ్రీధర్ అభినందించారు. ఈ నెల 20న తాను నెలకొల్పిన 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.35 లక్షల టన్నుల రవాణా రికార్డును సింగరేణి తానే తిరగరాసింది. బొగ్గు రవాణాకు దక్షిణ మధ్య రైల్వే సహకారంతో గరిష్ఠ స్థాయిలో 44 రేక్స్ వినియోగించడం కూడా కొత్త రికార్డే. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 70 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకొనేందుకు మిగిలిన 90 రోజుల్లో.. రోజుకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సీఎండీ ఆదేశించారు. అనుకున్నట్టుగానే బుధవారం ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో హర్షం వ్యక్తంచేసిన సీఎండీ.. అదే ఒరవడితో ముందుకు సాగాలని, సమిష్టిగా కృషి చేయాలని కోరారు.