హైదరాబాద్ : తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ లాభాల బాటలో పయణిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి ఏడు నెలల్లో రూ.868 కోట్ల లాభాలను సాధించి ఎవరికీ అందనంత స్థాయిలో ముందుకు సాగుతోంది. ఈ ఏడు నెలల్లో సింగరేణి సంస్థ రూ.14,067 కోట్ల టర్నోవర్ను సాధించింది. గడిచిన ఏడు నెలలకు సంబంధించిన కార్యకలాపాలను శనివారం సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అదే ఏడు నెలల కాలంలో 65 శాతం వృద్ధి సాధించి రూ.14,067 కోట్ల అమ్మకాలు జరిపిందని సీఎండీ తెలిపారు.
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గడంతో గతేడాది రూ.1,129 కోట్ల నష్టాలను సింగరేణి చవి చూసింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో కరోనా నివారణ చర్యలు ఫలించి.. బొగ్గు ఉత్పత్తి, రవాణా, విద్యుత్ అమ్మకాలుకూడా పెరగడంతో.. గతేడాదితో పోల్చితే 177 శాతం వృద్ధితో.. రూ.868 కోట్ల లాభాలను సాధించగలిగామని సీఎండీ వివరించారు.
గతేడాది రూ.6678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా.. ప్రస్తుత సంవత్సరంలో 78 శాతం వృద్ధితో.. రూ.11855 కోట్ల విలువైన బొగ్గు అమ్మకాలు చేశామని, అలాగే గతేడాది రూ.1860 కోట్ల విద్యుత్ అమ్మకాలు చేయగా.. ఈయేడు 18 శాతం వృద్ధితో రూ.2182 కోట్ల అమ్మకాలు జరిపామని తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో కేవలం 220 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణి.. 60 శాతం వృద్ధితో ఈయేడు 352 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందన్నారు. అలాగే గతేడాది 218 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయగా.. ఈయేడు 68 శాతం వృద్ధితో 367 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది ఏడు నెలల్లో 3819 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కాగా.. ఈ యేడు 39 శాతం పెరిగి.. 5291 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిందన్నారు.
దేశ, రాష్ట్ర విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి సంస్థ ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేస్తుందని, ఇదే ఒరవడితో మిగిలిన ఐదు నెలల కాలంలో కూడా గరిష్టంగా బొగ్గును ఉత్పత్తి, రవాణా చేస్తుందని పేర్కొన్నారు. దేశ విద్యుత్తు అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా సింగరేణి కుటుంబం మొత్తం అంకితభావంతో పనిచేస్తుందని సీఎండీ ఎన్ శ్రీధర్ వివరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా, వార్షిక టర్నోవర్, లాభాలు సాధించనున్నట్టు సీఎండీ శ్రీధర్ తెలపడం గమనార్హం.