హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణిది కీలకపాత్ర అని.. ఈ దిశగా రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలని ఆ సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరామ్, డీ సత్యనారాయణరావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో సింగరేణి డైరెక్టర్లు బొగ్గు ఉత్పత్తిపై ఆన్లైన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుడు ఏప్రిల్లో 4.86 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగ్గా… ఈ ఏడాది ఏప్రిల్లో 5.32 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి 9.6 శాతం వృద్ధిరేటును నమోదు చేశామని చెప్పారు. మే నెలలో రోజుకు 2.1 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలని ఆదేశించారు. దేశంలో విద్యుత్ కొరత నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టంచేశారు. సమావేశంలో సింగరేణి అధికారులు డీఎన్ ప్రసాద్, సురేంద్ర పాండే, కే సూర్యనారాయణ, కే నాగభూషణ్ రెడ్డి, రవి ప్రసాద్, సురేశ్, ఎన్వీకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.