నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 3: సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయంపై సింగరేణి భగ్గుమన్నది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. రామగుండం నగర పాలక సంస్థ మేయర్ బంగి అనిల్కుమార్, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ పాల్గొన్నారు. యైటింక్లయిన్ కాలనీలో టీబీజీకేఎస్, టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు.
ప్రధాని మోదీ దిష్టి బొమ్మను యూనియన్ కార్యాలయం నుంచి ర్యాలీగా తీసుకెళ్లి అంబేద్కర్ విగ్రహం ఎదుట దహనం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మూలంగా వేలాది సింగరేణి ఉద్యోగులు, కార్మికులు నష్టపోతారని, సంస్థ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మార్కెట్ సమీపంలో కోల్బెల్ట్ రహదారిపై టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ గెల్లి రాజలింగు ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిని ప్రైవేట్పరం చేసి ఈ ప్రాంతాన్ని ఏడారిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో గోదావరిఖని పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని చెప్పారని, ఇప్పుడేమో బెంగళూరులో బొగ్గు గనుల వేలానికి సంబంధించి ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అవసరమైన పోరాటం చేస్తామని, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ సూచనల మేరకు బీజేపీపై పోరు సాగిస్తామని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మిక ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు ‘మోదీ హటావో దేశ్కో బచావో’ అంటూ నినాదాలు చేస్తూ మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టి ప్రధాన సెంటర్లలో దహనం చేశారు. సత్తుపల్లిలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి రింగ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి రింగ్సెంటర్లో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణి జోలికి వస్తే సహించబోమని ఈ నిరసన కార్యమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హెచ్చరించారు. ఇప్పటికే ఎల్ఐ సీ, వైజాగ్ స్టీల్ప్లాంట్, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తున్న మోదీ చూపు లాభాల బాటలో నడిచే సింగరేణిపై పడిందని దుయ్యబట్టారు.