రామగిరి, మార్చి 7: పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం గని పైకప్పు కూలడంతో ఘోర ప్రమా దం సంభవించింది. ప్రమాద సమయంలో ఏడుగురు ఉండగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మొదటి షిఫ్టులో 11:35 గంటలకు గనిలోని 86వ లెవల్, ఎల్సీ-3 వద్ద ఒక్కసారిగా పైకప్పు కూలింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, గని డిప్యూటీ మేనేజర్ తేజతోపాటు మైనింగ్ సర్దార్ పిల్లి నరేశ్, ఆపరేటర్ జోడి వెంకటేశ్, సపోర్ట్మెన్ ఎరుకల వీరయ్య, బదిలీ వర్కర్ రవీందర్, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. దాదాపు 3 మీటర్ల పొడవున, 20 మీటర్ల వెడల్పు పైకప్పు కూలింది. కార్మికులను రక్షించేందుకు అధికారులు రెస్క్యూ టీంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మూడు గంటల తరువాత సపోర్టుమెన్ వీరయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా ఆరుగురిలో ఇద్దరి అరుపులు వినిపించడంతో శిథిలాలను తొలగించేందుకు చర్యలు వేగిరం చేశారు. 8 గంటలు శ్రమించిన రెస్క్యూ టీం కొన ఊపిరితో ఉన్న జాడి వెంకటేశ్, నరేశ్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ఏరియా దవాఖాకు తరలించారు. అయితే మిగతా నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. సింగరేణిలోనే అత్యంత అధునాతన విదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఇంతటి పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.