Singareni CMD Balaram | బొగ్గు ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలు విలువైనవని, రక్షణ లేని ఉత్పత్తి అవసరం లేదని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ పేర్కొన్నారు. కార్మికుల రక్షణ కోసం అమలు చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ అందరూ కలిసి సురక్షిత సింగరేణిని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేస్తూ ఉత్పత్తిని సాధించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఆయన 11 ఏరియాలోని మొత్తం 40 గనులు, విభాగాల రక్షణ కమిటీలు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, మైన్స్ కమిటీ సభ్యులు, ఇతర రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గతంలో గనుల్లో మేనేజర్ల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించే వారు. కానీ స్వయంగా సంస్థ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి నేరుగా సలహాలు సూచనలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థ అన్ని రంగాలలో అత్యుత్తమ కంపెనీగా నిలిచినా ప్రమాదాల నివారణలోమాత్రం కొంత వెనకబడటం విచారకరమని, దీనికి కారణం ఎక్కువగా మానవ తప్పిదాలే అని సీఎండీ ఎన్ బలరామ్ పేర్కొన్నారు. ప్రతి పనికి నిర్దేశించిన కొన్ని ఎస్ఓపీ (సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) లను సరిగా పట్టించుకోనందువల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలన్నారు. కార్మికుల రక్షణకు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సౌకర్యాలు సౌకర్యాలు సమకూరుస్తామన్నారు.
దవాఖానల్లో అవసరమైన ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తున్నామని ఎన్ బలరామ్ తెలిపారు. రామగుండం ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుతున్నామని హామీ ఇచ్చారు.
సూపర్వైజర్ల, ఇతర ఉద్యోగుల కొరతను తీర్చేందుకు 1800 పోస్టులకు ఇప్పటికే నియామకాల ప్రక్రియ చేపట్టామని, వచ్చే రెండు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. తద్వారా గనుల్లో సూపర్వైజర్ల కొరత ఉండబోదని స్పష్టం చేశారు.
కార్మిక కాలనీలను గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నామని ఎన్ బలరామ్ తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. చాలామంది ఉన్నత చదువులు చదివిన యువకులు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారని, అలాంటిది సింగరేణిలో ఉద్యోగ అవకాశం లభించిన వాళ్లంతా అంకితభావం, సంస్థ పట్ల కృతజ్ఞతతో పనిచేయాలన్నారు. గనిలో జరిగే ప్రమాదాల కన్నా రోడ్డు ప్రమాదాల్లో యువ కార్మికులు మృతి చెందారని, వారి మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రక్షణ పై అవగాహనకు ఎంవీటీసీలలో ప్రత్యేక శిక్షణలు ఇప్పించనున్నట్లు, అలాగే ఎంవీటీసీలను ఆధునికీకరించనున్నట్లు తెలియజేశారు.
సమావేశంలో పాల్గొన్న రక్షణ, మైన్స్ కమిటీ సభ్యులు అనేక విలువైన సూచనలు చేశారు. వారసత్వ ఉద్యోగాల కారణంగా ఉన్నత చదువులు చదివిన యువకులు సింగరేణిలో చేరారని, వీరికి గనిలో పని చేయడంలో మరింత ప్రత్యేక శిక్షణ అవసరం ఉందని వారు తెలిపారు. సీనియర్ కార్మికులు రిటైర్ అవ్వటం వల్ల కొంత అనుభవ రాహిత్యం ఏర్పడుతుందన్నారు. కార్మికులకు నాణ్యమైన బూట్లు అందించాలని, గనుల్లో మరింత అధునాతన ఆటోమేషన్ జరపాలని సూచించారు.
దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రతి ఏరియా నుంచి మాట్లాడిన కార్మికులు సీఎండీ తో నేరుగా మాట్లాడే అవకాశం లభించడంతో భావోద్వేగాలకు గురయ్యారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్ (ఆపరేషన్స్, పర్సనల్), డీ సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), జీ వెంకటేశ్వర్ రెడ్డి (పీ అండ్ పీ) మాట్లాడారు. సమావేశానికి కంపెనీ జీఎం (కో ఆర్డినేషన్) ఎస్డీఎం సుభానీ స్వాగతం పలికారు. జీఎం మార్కెటింగ్ శ్రీ రవి ప్రసాద్తోపాటు కంపెనీకి చెందిన అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు.