మరింత అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి చేపట్టిన జల సంరక్షణ చర్యలకు గుర్తింపుగా రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్.. ఉత్తమ పరిశ్రమ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిటిలిటీ) అవార్డు ఇవ్వడం సంతోషకరమని సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణీయులందరూ మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం నదులపై జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్ర మంత్రి హరీశ్రావు, వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ సింగరేణికి అవార్డు ఇవ్వడంపట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సింగరేణీయులకు అభినందనలు తెలుపుతూ.. మొదటి నుంచి సింగరేణి పర్యావరణహితమైన మైనింగ్ పద్ధతులను పాటిస్తున్నదని చెప్పారు. పరిశ్రమ వల్ల జల కాలుష్యం తలెత్తకుండా ప్రతి గనికి అనుబంధంగా సెట్లింగ్ ట్యాంక్లు, ఎఫ్ల్యూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈఎఫ్టీపీ), సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) నిర్మించి శుద్ధమైన నీటిని సమీపంలోని చెరువులు, కాలువలకు విడుదల చేస్తున్నదని తెలిపారు. ఆ నీటితో ఆరు జిల్లాల పరిధిలో వందల ఎకరాలలో రైతులు రెండు పంటలు పండించగలుగుతున్నారని సీఎండీ పేర్కొన్నారు. కంపెనీ ఏర్పాటుచేసిన సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వల్ల సమీప గ్రామాల్లో భూగర్భ జలాల స్థాయికూడా పెరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం కే సూర్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.