హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే సాయానికి రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ప్రైవేటు, ఎయిడెడ్ కలుపుకొని మొత్తంగా 83 వేల పైచిలుకు లబ్ధిదారులను విద్యాశాఖ అధికారులు ఎంపికచేశారు. వీరికి ఏప్రిల్, మే నెలల సాయాన్ని ఒకేసారి ఇవ్వనున్నారు. మొదటి విడతలోనే వీరంతా దరఖాస్తు చేసుకున్నా, పలు కారణాలతో సహాయం పొందలేకపోయారు. ఏప్రిల్ సహాయం నష్టపోరాదని భావించిన అధికారులు, మొదటివిడత వారితో కలుపుకొని రెండు నెలలకు చెందిన బియ్యం, నగదును అందజేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.48 కోట్లు విడుదలచేసింది. జిల్లాలవారీగా ఎంపికైన లబ్ధిదారుల జాబితా గురువారానికి విద్యాశాఖ డైరెక్టరేట్కు చేరింది. వివరాలను సోమవారం ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపించనున్నారు. ఆమోదం లభించగానే వీరికి నగదు, బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. మొదటి, రెండు విడతలు కలుపుకొని మొత్తంగా 2 లక్షల పైచిలుకు మంది సాయం అందుకోనున్నారు.