BJP | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు? అసెంబ్లీ సమావేశాలు మొదలైనా ఇంకా ఆ పార్టీలో ఈ ప్రశ్నకు సమాధానం రావడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం, హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య సైలెంట్ వార్ జరుగుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మందిలో తానొక్కడినే సీనియర్ అని, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి తనకే ఆ పదవి ఇవ్వాలని రాజాసింగ్ పట్టుబడుతున్నారు.
అయినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాజాసింగ్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆయనకు తెలుగు స్పష్టంగా రాకపోవడం ఒక అడ్డంకి కాగా, తరుచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో ఇరుక్కునే స్వభావం మరో అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్కు ఫ్లోర్లీడర్ అప్పగిస్తే.. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని నాయకత్వం భావిస్తున్నది.
ఈ సారి కొత్తవారికి అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నది. కామారెడ్డిలో గెలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరు తెరమీదికి వచ్చింది. మరికొందరు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డివైపు మొగ్గుచూపుతున్నారు. వయసులో పెద్దవాడైన ముథోల్ ఎమ్మెల్యే రామ్రావ్ పవార్ పేరును తెరపైకి తెచ్చినా.. ఆయనకు భాష సమస్య ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో మహేశ్వర్రెడ్డి, రమణారెడ్డిల్లో ఎవరో ఒకరికి ఫ్లోర్లీడర్ పదవి దక్కే అవకాశం ఉన్నదని సమాచారం.