గొర్రెలు, చేపల పంపిణీ బాగుంది
సిక్కిం రాష్ట్ర మంత్రి కితాబు
మంత్రి తలసానితో భేటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 19 అబ్దుల్లాపూర్మెట్: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల గురించి తలసాని ఆయనకు వివరించారు. పశువైద్యం కోసం ప్రత్యేకంగా సంచార వాహనాలను సమకూర్చినట్టు తెలిపారు. రూ.14.65 కోట్ల చొప్పున 100 వాహనాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు 3.88 లక్షల మంది లబ్ధిదారులకు 81.60 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గొర్రెల సంఖ్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని వెల్లడించారు. విజయ డైయిరీ రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తునట్టు తెలిపారు. ఇప్పటివరకు 2.93 లక్షల మందికి రూ.343 కోట్లు చెల్లించినట్టు వివరించారు. అనంతరం అబ్దుల్లాపూర్మెట్లోని రామోజీఫిలింసిటీలోని ప్రియ డెయిరీని సందర్శించారు. పాలశీతలీకరణ, పాల ఉత్పత్తిని పరిశీలించారు. తెలంగాణలోని వివిధ రకాల పశుజాతుల గురించి సిక్కిం మంత్రి లోకనాథ్శర్మ పశువైద్యులను అడిగితెలుసుకొన్నారు. ఇక్కడి పథకాలను సిక్కింలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హా, డైరెక్టర్ రాంచందర్నాయక్, టీఎస్ఏడీఏ సీఈవో మంజువాణి, సిక్కిం పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ టిమ్లి బాటియా, అడిషనల్ హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ దాల్, పబ్లిసిటీ విభాగం వైద్యులు శ్రీధర్వర్మ పాల్గొన్నారు.