వనపర్తి : జిల్లాలో చెరువులను పటిష్టం చేయడం వల్ల రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వనపర్తిలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మోడల్ మార్కెట్ , రాజపేట సమీపంలో నూతన పార్క్ పనులను కలెక్టర్ యాస్మిన్ భాషాతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా వనపర్తి అభివృద్ధి చేపడుతున్నామని వెల్లడించారు. నాలుగు దశాబ్దాల రోడ్ల విస్తరణను ప్రజల సహకారంతో పూర్తిచేస్తున్నామని అన్నారు. వనపర్తి మార్కెట్ ను రూ.49 కోట్లతో నూతనంగా నిర్మించామని, రూ.4 కోట్లతో ఎకో పార్క్ ను అభివృద్ధి చేశామని , మరో రూ.2 కోట్లతో వే సైడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని వివరించారు. నగరం నాలుగు దిక్కులా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే ఈ అభివృద్ధి సాధ్యమయిందని అన్నారు.