SIGH | యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనున్నది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడే కంపెనీ తయారు చేయనున్నది. రాబోయే రెండుమూడేళ్లలో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్లోకి అడుగిడుతున్నది.
ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. దావోస్లో సీఎం రేవంత్రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎస్ఐజీహెచ్ ఎండీ గౌరీ శ్రీధర్, డైరెక్టర్ అమర్ చీడిపోతు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు మొదటి దశలో జనరల్ సర్జికల్ పరికరాలు, మైక్రో సర్జరీకి ఉపయోగించే అధునాతన పరికరాలను తయారు చేయనున్నారు. ఆర్థోపెడిక్, చర్మ, నేత్ర సంబంధిత సున్నితమైన సర్జరీలకు అవసరమయ్యే పరికరాలను తయారు చేస్తుంది. రెండో దశలో రోబోటిక్ వైద్య పరికరాలను తయారీ చేసేలా యూనిట్ను విస్తరిస్తుంది. ఎస్ఐజీహెచ్ కంపెనీ యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్, అక్కడి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ) హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటళ్లకు తమ పరికరాలను సరఫరా చేస్తోంది.