Harish Rao | పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది సైన్స్ ఫెయిర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా స్టార్టప్ యుగం నడుస్తుందని తెలిపారు. డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులు మంచి మంచి ఆవిష్కరణలు చేస్తున్నారని తెలిపారు. సిద్దిపేట బాలికల హైస్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇన్నోవేషన్ లేకపోతే మనం లేమని అన్నారు. కరెంట్, టెలిఫోన్ లాంటివి అన్ని ఇన్నోవేషన్ నుండి వచ్చినవే అని తెలిపారు. ఇన్నోవేషన్కు ఆకాశమే హద్దు అని.. నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కంప్యూటర్ పోయి ఏఐ వచ్చిందని ప్రస్తావించారు.
విద్యార్థుల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు రావాలని హరీశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆలోచనలకు ప్రతిరూపం ఇన్నోవేషన్ అని తెలిపారు. మనకు మనం తక్కువ అంచనా వేసుకోకూడదని అన్నారు. ప్రతి విద్యార్థిలో సైంటిస్ట్, ఇంజనీర్ ఉంటాడని తెలిపారు. సైంటిస్ట్ కూడా ఒక విద్యార్థి అని అన్నారు. సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని అందిస్తాయని చెప్పారు. మనిషిలో ఉత్సాహం లేకపోతే ఓటమితో సమానమని అన్నారు. మనిషిలో ప్రోత్సాహం, ఉత్సాహం ఉండాలని అన్నారు.
సిద్దిపేటలో 1853 ప్రాజెక్టులు పెట్టారని.. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయని హరీశ్రావు అన్నారు. మన రాష్ట్రంలో అత్యుత్తమ సైన్స్ ఫెయిర్ సిద్దిపేటకు వచ్చిందని తెలిపారు. సిద్దిపేటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన మీ అందరిలో మంచి ఉత్సాహం నింపాలని కోరుతున్నానని తెలిపారు.
సైన్స్ అనేది మన జీవితాన్ని మార్చేస్తుందని హరీశ్రావు అన్నారు. మీరందరూ సిద్దిపేట పేరును నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఈ సైన్స్ ఫెయిర్ ను నిర్వహించిన ఉపాధ్యాయులకు, సిబ్బంది, అందరినీ అభినందించారు. వచ్చే టెన్త్ పరీక్షల్లో సిద్దిపేట టాప్లో ఉండాలన్నారు. మీకెలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొని రండి అని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులకు చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. DA లు రాలేదు.. రిటైర్మెంట్ పైసలు రావట్లేదు.. DEO లు లేరు.. పీఆర్సీ రాలేదు.. ఇలాంటి సమస్యలు అన్నింటి గురించి రాబోయే అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
విద్యార్థులు ఫోన్లు, టీవీలు బంద్ చేయాలని హరీశ్రావు సూచించారు. పొద్దున్నే లేచి మంచిగా చదువుకోవాలన్నారు. మంచి ర్యాంకులను సాధించి మీ తల్లిదండ్రుల పేర్లను, ఉపాధ్యాయుల పేర్లను, సిద్దిపేట పేరును నిలబెట్టాలని ఆశిస్తున్నానని తెలిపారు.