Neet | ఆ చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయింది.. నానమ్మ చేతులపైనే బతుకుబండి లాగాలి.. కానీ వైద్యురాలిని కావాలని కలలు కంటున్నది ఆ చిన్నారి.. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చిన్నారి పేరు నీరుడి విజయలక్ష్మి (16). ఫస్ట్ ఇయర్ ఇంటర్లో 440 మార్కులకు 419 మార్కులు స్కోర్ చేసిందా చిన్నారి. ఆమె ఐదేండ్ల వయస్సులో ఉన్నప్పుడే విజయలక్ష్మి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితేనేం.. మనస్సు ఉంటే మార్గం ఉండదా.. సర్వోదయ గ్రామ సేవా ఫౌండేషన్ (ఎస్జీఎస్ఎఫ్) సకాలంలో వారి ముందుకు వచ్చింది.
విజయలక్ష్మితోపాటు ఆమె అక్క మహేశ్వరి, తమ్ముడు జగదీశ్లకు కూడా ఎస్జీఎస్ఎఫ్ స్కాలర్షిప్ రూపంలో చేయూతనిస్తున్నది. మియాపూర్లోని కార్పొరేట్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్న విజయలక్ష్మికి ట్యూషన్ ఫీజుతోపాటు ప్రతి నెలా రూ.3000 స్కాలర్షిప్ అందిస్తున్నది. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న మహేశ్వరికి రూ.4000, నారాయణఖేడ్ మండలం హనుమంతరావు పేటలో 10వ తరగతి చదువుతున్న విజయలక్ష్మి తమ్ముడికి రూ.2000 స్కాలర్షిప్ అందిస్తున్నది.
తల్లిదండ్రులు చనిపోయిన 40 మంది చిన్నారులకు ఎస్జీఎస్ఎఫ్ అండగా నిలుస్తున్నది. విజయలక్ష్మి, ఆమె సోదరి, సోదరుడికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నామని ఎస్జీఎస్ఎఫ్ ఫౌండర్ డాక్టర్ సుధాకర్ నాయక్ చెప్పారు. ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ కోసం 2022-23 విద్యా సంవత్సరంలో జరిగే నీట్ పరీక్షకు హాజరు అయ్యేందుకు ప్రిపేర్ అవుతున్నది విజయలక్ష్మి. తానెలాగైనా డాక్టర్ను కావాలని కోరుకుంటున్నానని విజయలక్ష్మి చెప్పారు.
హనుమంతరావుపేట హామ్లెట్ గ్రామం లింగాపూర్ వీరి సొంతూరు. వీరి తల్లిదండ్రులు పదేండ్ల క్రితం మరణించారు. నాటి నుంచి ముగ్గురు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. వారికి నానమ్మ, ఇతర బంధువులు మద్దతుగా నిలుస్తున్నారు.