Siddipet | సిద్దిపేట, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అనేక జిల్లా కేంద్రాల్లో సకల వసతులతో ఐటీ టవర్లను నిర్మించి కంపెనీలను ఆహ్వానిస్తున్నది. ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ టవర్ను పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావుతో కలిసి గురువారం ప్రారంభించనున్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉన్నది. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని ఐటీ టవర్ను ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీతోపాటు పక్కనే పోలీస్ కమిషనరేట్, జిల్లా కలెక్టరేట్ ఉన్నాయి. ఆహ్లాదకర వాతావరణంతోపాటు దీనికి సమీపంలోనే త్రీస్టార్ హోటళ్లు, అర్బన్ ఫారెస్టు పార్కులు, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా ఉన్నాయి. 3 ఎకరాల సువిశాల స్థలంలో రూ.63 కోట్లతో జీప్లస్ 4 అంతస్థుల్లో ఐటీ టవర్ను నిర్మించారు. ఈ టవర్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. అదేరోజు వివిధ కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి సంతకాలు చేశారు. గత ఏడాది నిర్మాణ పనులు ప్రారంభం కాగా, త్వరితగతిన పూర్తయ్యాయి. ఐటీ టవర్ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి.
సిద్దిపేట ఐటీ టవర్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మంగళవారం మెగా జాబ్మేళా నిర్వహించగా, పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. ఓఎస్ఐ డిజిటల్ (244 ఉద్యోగాలు ), ఫిక్సిటీ టెక్నాలజీస్ (100), అమిడాయ్ ఎడ్యుటెక్ (80), జోలాన్ టెక్ (25), విజన్ ఇన్ఫో టెక్ (25), థోరాన్ టెక్నాలజీస్ (25), బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్ (03), ర్యాంక్ ఐటీ సర్వీసెస్ (25), కామ్సీఎక్స్ ఐటీ (25), ఎంఎస్పీఆర్ (25) అమృత సిస్టమ్ (25) ఇన్నోసోల్ (25) ఉద్యోగాలు కల్పించాయి. తొలుత 718 మందిని కంపెనీలు ఎంపిక చేసుకొన్నాయి. ఐటీ టవర్ ప్రారంభించిన మరు నిమిషం నుంచే వీరంతా పనిచేసేలా వసతులు కల్పించారు. జాబ్మేళాలో ఉద్యోగాలు పొందినవారికి టాస్ ద్వారా శిక్షణ అందిస్తారు. సిద్దిపేట ఐటీ టవర్లో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన కంపెనీలకు రెండేండ్లపాటు ఉచితంగా నిర్వహణ, అద్దె, విద్యుత్తు, ఇంటర్నెట్ బిల్లులు భారం లేకుండా చూస్తామని మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.
సిద్దిపేట ఐటీ టవర్ భవనం మొత్తం ఏరియా 1,72,645 ఎస్ఎఫ్టీ, మొదటి అంతస్తు 28,783 ఎస్ఎఫ్టీ, రెండో ఫ్లోర్ 17,750 ఎస్ఎఫ్టీ, మూడో ఫ్లోర్ 17,750 ఎస్ఎఫ్టీ, నాలుగో ఫ్లోర్ 16,680 ఎస్ఎఫ్టీ ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ రెండో ఫ్లోర్లో 256, మూడో ఫ్లోర్లో 206, నాలుగో ఫ్లోర్లో 256 మంది. ఈ ఐటీ టవర్ నిర్మాణంతో జిల్లా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా 2 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఐటీ పార్కు ప్రారంభానికి సిద్ధం కావటంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నది.