Online Betting | సిద్దిపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్నే బలిగొన్నది. సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ రెండేండ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి లక్షలాది రూపాయల అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే దారిలేక తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి ఆపై తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామునిపట్లకు చెందిన 2013 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేశ్ ఐదేండ్లుగా సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్నారు. నరేశ్ (35)కు భార్య చైతన్య (30), కుమారుడు రేవంత్(6), కుమార్తె రిషిత(5) ఉన్నారు.
సిద్దిపేటలో నివాసం ఉంటూ డ్యూటీ చేసేవారు. చైతన్య సిద్దిపేటలోని ప్రైవేట్లో స్కూల్లో పనిచేస్తున్నారు. వీరి పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు. అప్పుల కారణంగా నరేశ్ ఇరవై రోజుల క్రితం తన మకాం రామునిపట్లకు మార్చారు. అక్కడి నుంచే డ్యూటీకి వెళ్లివస్తున్నారు. శుక్రవారం ఉదయమే డ్యూటీకి వెళ్లిన నరేశ్.. ఆ తరువాత తన భార్యకు ఫోన్ చేసి.. ‘నేను వచ్చి మిమ్మల్ని స్కూల్ వద్ద డ్రాప్ చేస్తా. వచ్చే వరకు ఇంట్లోనే ఉండండి’ అని చెప్పారు. ఉదయం 10.30 గంటల ప్రాం తంలో ఇంటికి చేరుకొన్నారు. ఇంటికి వెళ్లగానే భార్యతో గొడవ జరిగినట్టు సమాచారం. ఆ తరువాత తన సర్వీస్ రివాల్వర్తో భార్యను, ఇద్దరి పిల్లలను పాయింట్ బ్లాక్లో కాల్చి ఆపై తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, ఏసీపీ సురేందర్రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు అక్కడి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నలుగురి మృతదేహాలను సిద్దిపేట జిల్లా దవాఖానకు తరలించారు. నరేశ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, పూర్తి స్థాయి విచారణ జరిపిన తరువాత వివరాలు వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు.
తల్లిదండ్రులు రూ.30 లక్షలు ఇచ్చినా తీరని అప్పులు
నరేశ్కు దాదాపు రూ.80 లక్షల వరకు అప్పు ఉన్నట్టు సమాచారం. అప్పులు ఉన్నాయని, తనకు ఆస్తి పంచి ఇవ్వాలని ఇటీవల నరేశ్ తల్లిదండ్రులను అడిగారు. వారికి మొత్తం రెండు ఎకరాలు ఉండగా ఇటీవలే ఎకరం అమ్మితే రూ.42 లక్షలు రాగా ఇతని వాటా కింద దాదాపు రూ.30 లక్షలు ఇవ్వడంతో అప్పు చెల్లించారు. మిగితా డబ్బులు కూడా ఇస్తే మరిన్ని అప్పులు తీర్చేస్తానంటూ తల్లిదండ్రులతో గొడవపడినట్టు సమాచారం. ‘డబ్బులన్నీ నీ ఒక్కడికే ఇస్తే మరో ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏమిటి?’ అని తల్లిదండ్రులు నరేశ్ను నిలదీసినట్టు తెలిసింది. అప్పుల భారం తీరే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపానికి గురై ఇంతటి దారుణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది.