సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని చేర్యాల జెడ్పీటీసీ శెట్టి మల్లేశంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రోజూలానే సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. దీంతో తలకు తీవ్రగాయాలు అవడంతో మల్లేశం అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.