రాయపర్తి, జనవరి 18: ఎముకలు కొరికే చలిలో, ఊరికి దూరాన బురద నీటి లో మూడు రోజులు గా అచేతనావస్థలో ఉన్న ఓ వృద్ధుడిని కాపాడారు వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్సై బండారి రాజు. వృద్ధుడిని తనే స్వయంగా భుజాలపై మోస్తూ దవాఖానకు తరలించారు. రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలోని ఊరకుంటలోని బురదలో పడి ఉన్న వృద్ధుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై రాజు అక్కడికి వెళ్లి వృద్ధుడికి కొత్త దుస్తులు తొడిగారు. అతడిని తరలించేందుకు తెచ్చిన ట్రాక్టర్ బురదలో కూరుకుపోవడంతో ఎస్సై స్వయంగా భుజంపై మోసి బయటికి తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. వృద్ధుడి సంబంధీకుల సమాచారం దొరకలేదని, అతడిని తానే పోషిస్తానని ఎస్సై చెప్పారు. కాగా, వృద్ధుడిని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందించారు.