హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలిదశ అయిన ప్రిలిమినరీ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియమక మండలి సిద్ధమవుతున్నది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు ఏడో తేదీన ఎస్సై ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది. రెండు వారాల వ్యవధితో అంటే ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని తెలిసింది.
పోలీస్, ఫైర్, జైళ్ల శాఖ, ఎక్సైజ్, రోడ్డు రవాణాశాఖల్లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ ఇవ్వగా.. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 20 గడువు తేదీ. అనంతరం అభ్యర్థుల వివరాలను సరిచూసుకున్న తర్వాత అర్హులైన అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రిలిమినరీ పరీక్షలో అందరు అభ్యర్థులకు 200 మార్కులకుగాను 30 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు. 30 శాతం మార్కులు దాటిన అభ్యర్థులు తర్వాతి దశకు వెళ్తారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు దాదాపు ఇవే తేదీల్లో ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు అందుకు తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుని సన్నద్ధం కావడం ఉత్తమని అధికారులు సూచిస్తున్నారు.