హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణుల జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియమాక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) విడుదల చేసింది. తదుపరి దశలో ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించినవారు, అనర్హుల వివరాలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, లాగిన్ ఐడీ ద్వారా అభ్యర్థులు ఈ వివరాలను పొందవచ్చని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు.
పార్ట్-2 దరఖాస్తుకు నవంబర్ 10 గడువు
ప్రాథమిక రాత పరీక్ష ఉత్తీర్ణులై ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 27 ఉదయం 8 నుంచి నవంబర్ 10 రాత్రి 10 గంటల్లోగా పార్ట్-2 దరఖాస్తును అప్లోడ్ చేయాలని శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలు ప్రతి అభ్యర్థికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. వాటి ఫలితాలనే అన్ని పోస్టులకు పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి ఎస్సైతోపాటు సివిల్, ఎక్సైజ్, ట్రాన్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్నా అన్నింటికీ ఈ పరీక్ష ఫలితాలనే గమనంలోకి తీసుకొంటారు.