హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పరీక్షాకేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వెల్లడించింది. ఈ మూడు జిల్లాల నోడల్ అధికారులతో పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. పరీక్షాకేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులు ఆదేశించారు. మహిళా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఈ నెల 6 అర్ధరాత్రి వరకు వరకు వేచిచూడకుండా వెంటనే అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.