హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. గురువారం నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ నిధి సంస్థ ఆధ్వర్యంలో 64.35 లక్షల మంది మహిళలకు కలిపి గ్రూప్ ఇన్సూరెన్స్ కింద దీనిని అమలు చేయనున్నది.
ఈ పథకం కింద ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల వరకు బీమా పరిహారం అందనున్నది. ఈ పథకానికి ప్రభుత్వం ఏటా రూ.96.53 కోట్లు ఖర్చు చేయనున్నది. మరోవైపు ‘లోన్ బీమా’ పథకం అమలుకు సైతం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న ఎస్హెచ్జీ సభ్యులకు అదనంగా రూ.2 లక్షల కవరేజీ లభిస్తుంది. ఈ డబ్బుతో రుణం చెల్లించేందుకు అవకాశం కలుగనున్నది.