హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): దృశ్యం సినిమా గుర్తుందా.. ‘ఘటన జరిగిన రోజు మనం ఇక్కడ లేము.. మనం ఏదీ చూడలేదు.. వినలేదు’ అని వాళ్లంతా ఫిక్స్ అయ్యి, ఎదుటివారిని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అచ్చం ఇలాంటి వ్యవహారమే చేయబోయి బొక్కబోర్లా పడ్డారు. బీజేపీ అనుబంధ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య శనివారం హైదరాబాద్కు వచ్చి, మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేసే ఉద్దేశమే లేదని స్పష్టంచేశారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీలు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుకాగానే.. బీజేపీ నేతలు దిద్దుబాటు చర్యలకు ది గారు. బీజేపీ కార్యాలయంలో జరిగే ప్రెస్మీట్లు, ముఖ్యమైన సమావేశాలను ఆ పార్టీ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో లైవ్ ఇస్తారు.
లాల్ సింగ్ ఆర్య ప్రెస్మీట్ను కూడా లైవ్ ఇచ్చారు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలోని ఎస్సీలంతా భగ్గుమనడంతో బీజేపీ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ ప్రెస్మీట్ వీడియోను డిలీట్ చేశారు. కనీసం ఫొటోలు కూడా పోస్ట్ చేయలేదు. ఆర్య ట్విట్టర్ ఖాతాలోనూ ఆ వీడియోను డిలీట్ చేశారు. అసలు ప్రెస్మీట్ జరగనట్టే బిల్డప్ ఇచ్చారు. అంతేకాదు.. లాల్సింగ్ ఆర్య మరో వీడియో విడుదల చేస్తూ ‘ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇస్తుంది’ అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తానే ఖండించుకోవడం గమనార్హం. ఆర్య వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా దళితులు మండిపడుతున్నారు. మోసం చేయడమే కాకుండా, ఇప్పుడు వర్గీకరణ ప్రసక్తే లేదనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ బీజేపీని నమ్మేదేలేదని స్పష్టం చేస్తున్నారు.