యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య ఆరాదనలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు అర్చకులు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. తెల్లవారు జామూన మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీ నారసిండిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించి స్వామివారి కైంకర్యాలను చేపట్టారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచి ఆళ్వారును కొలిచారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని కల్యాణవేడుకను కన్నులారా వీక్షించి తరించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసిండిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారిని సహస్రనామార్చన చేశారు.
వ్రతాల్లో 203 జంటలు
శ్రావణమాసం సందర్భంగా యాదాద్రిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రాతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణమాసం రెండో శనివారం కావడంతో వ్రతాల్లో 203 జంటల పాల్గొన్నారు. నిష్ఠతో వ్రతమాచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో వ్రతాల ద్వారా స్వామివారి ఖజానాకు రూ. 1,01,500 ఆదాయం సమకూరింది.
స్వామివారిని దర్శించుకున్న ఆదిలాబాద్ ఎంపీ..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
పాత గోశాల వద్ద ప్రసాద విక్రయ కేంద్రం
స్వామివారి ఆలయం ప్రాంగణంలోని పాత గోశాల వద్ద భక్తుల సౌకర్యార్ధం శనివారం ఆలయ అధికారులు ప్రసాద విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రావణమాసం సందర్భంగా పెద్ద ఎత్తున జరిగే సత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని పాతగోశాల వద్ద విశ్రాంతి గదుల్లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వ్రతమాచరించే భక్తులతో పాటు స్థానికులకు స్వామివారి ప్రసాదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రసాద విక్రయశాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారి ఖజానాకు రూ. 13,46,575 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 13,46,575 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్తో రూ. 1,92,824, రూ. 100 దర్శనంతో రూ. 2,800, వీఐపీ దర్శనం ద్వారా రూ. 94,500, నిత్యకైంకర్యాలతో రూ. 600, సుప్రభాతం ద్వారా రూ. 4,021, క్యారిబ్యాగులతో రూ. 5,500, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 1,01,500, కళ్యాణకట్టతో రూ. 24,600, ప్రసాద విక్రయంతో రూ. 5,33,890, శాశ్వతపూజల ద్వారా రూ. 24,696, వాహనపూజలతో రూ. 11,600, టోల్గేట్తో రూ. 1,400, అన్నదాన విరాళంతో 58,631, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,11,200, యాదరుషి నిలయంతో రూ. 70,800, పాతగుట్టతో రూ. 32,935, ఇతర విభాగాలతో రూ. 75,048తో కలుపుకుని రూ. 13,46,575 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.