నల్లగొండ : స్వార్థం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఉప ఎన్నికలను తీసుకువచ్చి ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. ఆదివారం మునుగోడు మండలంలోని గూడపూర్ గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డాక దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
ముఖ్యంగా రైతాంగానికి రైతుబంధు, 24 గంటలు ఉచిత కరెంటు పథకాలు ఇచ్చారన్నారు.. ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు , ఆసరా పింఛన్లు ఇస్తున్నారన్నారు. అభివృద్ధిని గిట్టని మోదీ ఉచిత కరెంటు తొలగించి మీటర్లు పెట్టి ఏటా రూ. 15,000 వసూలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేస్తే మోరిలో వేసినట్టేనని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సుమారు 20 మంది టీఆర్ఎస్ లో చేరారు. వారికి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కండువా వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు నారీ నరసింహ, చీర పంకజ్ యాదవ్, కడారి కృష్ణయ్య, ఒంగోలు సహదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.