గాడ్సే వారసులు బీజేపీ నేతలు రిజర్వేషన్ల సంఖ్య పెరగాలన్నా,అసమానతలు తొలిగిపోవాలన్నాదేశానికి కొత్త రాజ్యాంగం కావాలి కేసీఆర్ ప్రతిపాదనలో తప్పేంటి? మాజీ డిప్యూటీ సీఎం కడియం కేసీఆర్ ప్రతిపాదనపై చర్చ జరగాలి మోదీ అధ్యక్ష పాలన కావాలనలేదా? ఎమ్మెల్యేలు బాల్కసుమన్, క్రాంతి
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు తామే అసలైన వారసులమని, బీజేపీ నేతలు గాడ్సే వారసులని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఏడున్నర దశాబ్దాలు పూర్తిచేసుకొన్న స్వతంత్ర భారతంలో ఇంకా అసమానతలున్నాయని, వీటిని రూపుమాపడానికే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ దేశానికి నూతన రాజ్యాంగం అవసరమని చెప్పారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చంటి క్రాంతికిరణ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ ఆశించిన న్యాయం దక్కలేదని, దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి కొరవడిందని అందువల్లనే నూతన రాజ్యాంగం అవసరమని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని కడియం శ్రీహరి చెప్పారు. ఆ ప్రతిపాదనపై చర్చించే దమ్ములేక, టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను అంబేద్కర్కు, దళితులకు వ్యతిరేకమని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం రాసుకోవాలన్న కేసీఆర్ మాటల్లో తప్పేముందన్నారు. ఈ దేశానికి అంబేదర్ రాజ్యాంగం ముమ్మాటికీ పవిత్రగ్రంథమని, అయితే దానిని ఇప్పటికి 105సార్లు సవరించారని గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం వరకే అనుమతిస్తున్నారని, ఆ సంఖ్య పెరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరం లేదా? అని ప్రశ్నించారు. దేశంలో అసమానతలు రూపుమాపడానికి కొత్త రాజ్యాంగం అవసరముందని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. బీజేపీ నేతలకు అంబేద్కర్పైన, ఆయన రాసిన రాజ్యాంగంపైన గౌరవం ఉంటే విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించాలని సవాల్ చేశారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతూ పేదలను మరింత పేదలుగా చేస్తున్న బీజేపీకి అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని మండిపడ్డారు. బీజేపీ నూటికి నూరుశాతం దళిత, రైతు, మైనారిటీ, గిరిజన, మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బీజేపీకి దమ్ముంటే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలన్నారు. బండి సంజయ్ బట్టేబాజ్, దోఖేబాజ్, బుడ్డరఖాన్ మాటలు బంద్ చేయాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారని, తమ పార్టీ విధానాలు అవేనని చెప్పారు. బీజేపీ నేతలు ఇష్టారీతిగా మాట్లాడితే ఆర్మూర్లో ఎంపీ అర్వింద్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు సాధించకపోతే మార్చవచ్చనే సంకేతాలు అంబేదర్ అప్పుడే ఇచ్చారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు. రాజ్యాంగం సక్రమంగా అమలు కాకపోతే తానే తగులబెడతానని 1953, సెప్టెంబర్ 2న ఆయనే స్వయంగా అన్న విషయం బీజేపీ నేతలకు తెలుసా? అని ప్రశ్నించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారని చెప్పారు. దేశాన్ని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయన్నారు. నూతన రాజ్యాంగం అవసరమన్న కేసీఆర్ అభిప్రాయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ ప్రగతి కోసమే కేసీఆర్ కొత్త రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని, ఇది కాంగ్రెస్, బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదని విమర్శించారు. దమ్ముంటే కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2000 సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వం జస్టిస్ వెంకటాచలయ్య సారథ్యంలో రాజ్యాంగ పునఃసమీక్ష కమిటీ ఎందుకు వేసిందని సుమన్ నిలదీశారు. ‘అంబేద్కర్ను అవమానించిన అరుణ్శౌరిని కేంద్ర మంత్రిని చేసింది బీజేపీ కాదా? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తెల్లారే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు చైర్మన్ను చేయలేదా?’ అని సుమన్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ పరిశోధన విద్యార్థులకు ఇచ్చే ఆర్జీఎన్ఎఫ్ను బీజేపీ ఎందుకు రద్దు చేసిందని అడిగారు. బీజేపీ నేతలకు అంబేద్కర్పై, దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చటాన్ని లొట్టపీసు చట్టంగా అభివర్ణించిన ఎంపీ అరవింద్ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే దళితులపై ఎకువ అరాచకాలు, అత్యాచారాలు సాగుతున్నాయని వివరించారు. బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా టీఆర్ఎస్ ఏర్పడిందని, అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్వయంగా కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, సింగరేణి వంటి ప్రభుత్వరంగ సంస్థలు అమ్మకూడదన్నా, ఎన్నికల మ్యానిఫెస్టోలు అమలు కావాలన్నా పటిష్ఠమైన రాజ్యాంగం ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఉన్నతాధికారులుగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అప్రదిష్టపాలు చేసిన వారు రాజకీయాల్లోకి వచ్చి నీతులు వల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త రాజ్యాంగంపై చర్చించటం ఇష్టంలేకనే బీజేపీ రాద్ధాంతం చేస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. దేశంలో అధ్యక్ష తరహా పాలన ఉండాలని ప్రధాని మోదీ ఇటీవల చెప్పారని, అలా జరిగితే ఈ రాజ్యాంగం ఉంటుందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో అంబేదర్ పేరు మాత్రమే ఉందని, ఆయన స్ఫూర్తిని రెండు జాతీయ పార్టీలు మంటగలిపాయని విమర్శించారు.