హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు ఒక సూచికగా పరిగణిస్తారు. కానీ, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత పట్టిపీడిస్తున్నది. యూనివర్సిటీలు, కాన్స్టిట్యుయంట్ కాలేజీలన్న తేడా లేకుండా అంతటా కొరత వెక్కిరిస్తున్నది. అత్యంత కీలకమైన ఈ సూచీలో బీజేపీ రాష్ర్టాల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను, అధ్యాపకులను నియమించలేని దుస్థితిలో ఆయా రాష్ర్టాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో విద్యార్థులకు తగినట్టుగా ఆచార్యులు, అధ్యాపకులు అందుబాటులో లేరు.
జాతీయంగా సగటున యూనివర్సిటీల్లో 18 మంది, కాన్స్టిట్యుయంట్ కాలేజీల్లో 38 మంది విద్యార్థులకు ఒక ఆచార్యుడు, అధ్యాపకుడు చొప్పున అందుబాటులో ఉండగా, బీజేపీ రాష్ర్టాలు వెనుకబడిపోయాయి. జాతీయంగానూ, పలు రాష్ట్రాల్లోనూ ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు పెరుగుతున్నా.. ఇందుకనుగుణంగా ఫ్యాకల్టీని నియమించకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఈ విషయం ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) 2020-21 నివేదికలో వెల్లడయ్యింది. 2016-17లో రెగ్యులర్, డిస్టెన్స్ విద్యలో 26 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ, రెగ్యులర్ విద్యలో 19 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ చొప్పున ఉండగా, 2020-21 నాటికి రెగ్యులర్ డిస్టెన్స్ విద్యలో 38 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ, రెగ్యులర్ విద్యలో 19 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉన్నారు.
విద్యా వసతుల్లో తెలంగాణ ఉత్తమం
విద్యా వసతుల కల్పనలో తెలంగాణ ముం దంజలో ఉన్నది. జాతీయ సగటును తలదన్నుతూ తెలంగాణ అగ్రభాగంలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ స్థానం పొందింది. వర్సిటీలు, కాన్స్టిట్యుయంట్ కాలేజీల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణలో అధ్యాపకులు అధికంగా ఉండటం విశేషం. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 18 మం ది విద్యార్థులకు, కాన్స్టిట్యుయంట్ కాలేజీల్లో 41 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున పనిచేస్తున్నారు. పలు పెద్ద రాష్ర్టాలతోపాటు జాతీయ సగటు కన్నా మన రాష్ట్రంలో ఈ నిష్పత్తి ఉత్తమంగా ఉండటం విశేషం.