హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన పట్టణాల్లో అభివృద్ధి అడుగు ముందుకు పడకపోగా, రెండడుగులు వెనకి పడింది. అధికార యంత్రాంగం లేక, నిధుల ప్రవాహం కరువై ఈ పురపాలికలు అనాథలుగా మారాయి. కొత్త మున్సిపాలిటీల్లో ఇన్చార్జ్లే రాజ్యమేలుతున్నారు. రాష్ట్రంలోని 130కిపైగా మున్సిపాలిటీల్లో సగం కంటే ఎకువ చోట్ల రెగ్యులర్ అధికారులు లేరు. ఒకే కమిషనర్ రెండు, మూడు మున్సిపాలిటీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారంలో ఒకరోజు కూడా ఆయా మున్సిపాలిటీలకు సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. పట్టణాల్లో ముఖ్యమైన పనులు పర్యవేక్షణకు అధికారుల కొరత వేధిస్తున్నది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు (టీపీవో), అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈ), మేనేజర్లు వంటి కీలక పోస్టులు 40% నుంచి 50% వరకు ఖాళీగా ఉన్నాయి.
వెకిరిస్తున్న సిబ్బంది కొరత
పారిశుద్ధ్యం నుంచి పన్నుల వసూళ్ల వరకు ప్రతి విభాగంలోనూ సిబ్బంది కొరత మున్సిపాలిటీలను వేధిస్తున్నది. జనాభా పెరిగినా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరుగలేదు. ఫలితంగా కొత్త కాలనీల్లో చెత్త సేకరణ, డ్రైనేజీ క్లీనింగ్ అనేవి గగనమయ్యాయి. మున్సిపాలిటీల జనరల్ ఫండ్స్ ఖాళీ అవ్వడంతో, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 3 నుంచి 4 నెలలుగా వేతనాలు అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పురపాలక శాఖకు కేటాయించినట్టు చెప్తున్న రూ.17,472 కోట్ల నిధులు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కొన్ని మెగా ప్రాజెక్టులకే పరిమితమయ్యాయి. కొత్త మున్సిపాలిటీల్లో నిధులు లేవు, నియామకాలు లేవు. కేవలం బోర్డులు మార్చి ప్రజలపై పన్నుల భారం వేయడం తప్ప, సౌకర్యాల కల్పనలో సరార్ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిధులు లేవు.. నియామకాలు లేవు
సంగారెడ్డి జిల్లాలో 2024 డిసెంబర్లో కోహీర్, గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ను కొత్తగా మున్సిపాలిటీలుగా సర్కార్ ఏర్పాటుచేసింది. మున్సిపాలిటీల బోర్డులు మారినప్పటికీ వాటికి ప్రభుత్వం ఎలాంటి నిధులు, నియామకాలు కేటాయించలేదు. ఇస్నాపూర్ మున్సిపాలిటీని కేస్ స్టడీగా తీసుకుంటే.. ఇస్నాపూర్ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ, మున్సిపల్ పాలనలో మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నది. మున్సిపాలిటీగా మారిన తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త పోస్టుల భర్తీ జరగలేదు. కమిషనర్ కూడా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు.
26 అర్బన్ అథారిటీలు ఏమైనయ్?
రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసింది. వాటి గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు మాట్లాడం లేదు? ప్యూర్, క్యూర్, రేర్ అని మాటలు చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా పనులు చేయడం లేదు. అర్బన్ అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించడం లేదు. ఆర్భాటంగా కొత్త మున్సిపాలిటీ ప్రకటించారు తప్ప వాటికి నిధులు ఇవ్వడం లేదు. నియామకాలు చేపట్టడం లేదు. అర్బన్ ప్రాంతాల్లోనే 50 శాతానికిపైగా జనాభా ఉంటున్నది. పట్టణ అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. రేవంత్రెడ్డి సర్కార్ తీరు మాటలు ఎక్కువ.. పని తక్కువ అన్నట్టుగా ఉన్నది.
-ఎన్ శ్రీనివాస్, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్