హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ పాలనలో వినియోగదారులను దోచుకుంటున్నారు. రాష్ట్రంలో వేసవిలోకాలంలో ఎక్కువగా అమ్మకాలు జరిగే బ్రీజర్లు దొరకడంలేదు. మద్యంప్రియులు వేసవిలో చాలావరకు తక్కువ ఆల్కహాల్తోపాటు రూ. 130కే దొరికే బ్రీజర్లనే ఎక్కువగా సేవిస్తుంటారు. రెండు మూడు నెలల నుంచి మద్యం దుకాణాల్లో బ్రీజర్లు దొరకడంలేదు, రూ.210 ధర ఉన్న బ్రీజర్లు మాత్రమే లభిస్తున్నాయి. ఈ బ్రీజర్ల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని వినియోగదారులు పేర్కొంటున్నారు. వేసవికాలానికి ముందే బ్రీజర్ల కృతిమ కొరత సృష్టించి ఎక్కువ ధర కలిగిన బ్రీజర్లు కొనుగోలు చేసేలా కుట్రలు చేస్తున్నట్టు పలువురు అభ్రిపాయపడుతున్నారు. బ్రీజర్ల కొరత కారణంగా అదనంగా ఒక్కో బాటిల్కు రూ. 70 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని మద్యంప్రియులు వాపోతున్నారు.
నెలకు 50 కేసులపైనే..
వేసవిలో ఒక్కో మద్యం షాపు నుంచి కనీసం 50 కేసుల బ్రీజర్ల అమ్మకాలు జరుపుతామని మద్యం షాపుల యజమానులు చెప్తున్నారు. దాదాపు రెండు నెలల నుంచి బ్రీజర్లు అందుబాటులో లేకపోవడంతో ధర ఎక్కువున్న వాటిని కొనుగోలు చేయలేక వినియోగదారులు వెనుదిరుగుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం బ్రీజర్లతోపాటు మరికొన్ని బ్రాండ్ల మద్యం కూడా రావడం లేదని పేర్కొంటున్నారు. దీంతో ఈ కృత్రిమ కొరత వెనుక కొందరు బడాబాబులు, ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నదని పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలే కాక అర్బన్, నగరాల్లో కూడా ఈ బ్రీజర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నదని వినియోగదారులు వాపోతున్నారు.