హైదరాబాద్: రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ది సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), సైబరాబాద్ పోలీస్ విభాగం సంయుక్తంగా షార్ట్ఫిల్మ్స్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి. కాగా, సైబర్ నేరాలపై షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ నిర్వహించడం ఇదే తొలిసారి. రోడ్ సేఫ్టీపై ఇప్పటికే మూడు పర్యాయాలు విజయవంతంగా షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ నిర్వహించిన ఎస్సీఎస్సీ.. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులతో జతకట్టి ఒక ఫౌండేషన్ను ప్రారంభించింది.
ఇప్పుడు సైబర్ నేరాలు అనే అంశంపై షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ పోటీపై ఆసక్తి ఉన్నవారు 60 నుంచి 120 సెకన్ల నిడివిగల వీడియోలతో తమ ఎంట్రీస్ను పంపవచ్చు. వీడియోలను తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో చేయవచ్చు. అయితే వీడియో ఏ భాషలో ఉన్నా అందులోని డైలాగులకు సంబంధించిన సబ్టైటిల్స్ మాత్రం కచ్చితంగా ఇంగ్లిష్లో ఇవ్వాలి.
వీడియో క్వాలిటీ కచ్చితంగా 1920×1080 రిజల్యూషన్తో ఉండాలి. పోటీలో పాల్గొనదలిచేవారు ఈ నెల 15లోగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. నవంబర్ 16న టాపిక్ గురించి వివరించాలి. మీరు ఎంచుకునే టాపిక్లు కేవైసీ ఆప్డేషన్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, ఇంటి అద్దె పేరుతో మోసాలు, వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన మోసాలు, కస్టమర్ కేర్ మోసాలకు సంబంధించినవై ఉండాలి. నవంబర్ 30వ తేదీలోగా వీడియోలను పంపించాలి. ఈ పోటీలో విజేతకు రూ.30 వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.20 వేలు నగదు బహుమతి ఇస్తారు.