Left Parties | ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. సీపీఎం, సీపీఐలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలా ? లేక ఇతర రాజకీయ పార్టీలతో జట్టు కట్టాలా ? అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నాయి. మతోన్మాద శక్తులను ఓడించాలన్న ఏకైక ధ్యేయంతో ముందుకెళ్లే కమ్యూనిస్టుపార్టీలు తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు రాజకీయపరమైన చర్చ నడుస్తున్నది.
ఇప్పటివరకు లౌకికవాద పార్టీలతో జట్టు కట్టిన సీపీఐ,సీపీఎం లు… సందర్భానుసారంగా కొన్నిసార్లు కలిసి, మరికొన్ని సార్లు వేర్వేరుగా లౌకికవాద పార్టీలకు స్నేహహస్తం అందించాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన సీపీఐ.. పొత్తులో భాగంగా కొత్తగూడెంను సాధించుకున్నది. సీపీఎం కూడా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలని పావులు కదిపినా ఫలించలేదు. వైరా, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలను ఆశించిన సీపీఎం డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పట్టున్న స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో వామపక్ష పార్టీలు ఇంకా పట్టువిడుపులపైనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు సీపీఐ స్నేహహస్తం అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తమకు వరంగల్ లేదా కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కేటాయించాలని కోరినట్లు తెలుస్తున్నది. కానీ ఇప్పటికే వరంగల్ లోక్సభకు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు పొడుస్తుందా ? లేదా ? అనేది కొంత కాలం గడిస్తే కానీ చెప్పే పరిస్థితులు కనిపించుట లేదు.
సీపీఐ కూడా కాంగ్రెస్తో కలిసి నడువాలా ? లేక ఒంటరిగా బరిలోకి దిగాలా ? అనే సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన సీపీఎం పట్టున్న స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుందా ? అని రాజకీయ వర్గాలో చర్చ నడుస్తున్నది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుందా..? లేదా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తుందా..? అనే విషయంపై పార్టీ నేతలు చర్చించుకుని త్వరలో స్పష్టత ఇస్తారని తెలుస్తున్నది. లోక్సభ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. రెండు పార్టీల పయనంపై ఇకనైనా స్పష్టత వస్తుందేమో చూడాలి.